వారి పట్ల గర్వంగా ఉంది.. స్కూళ్లు తెరుస్తాం: ట్రంప్‌

11 Sep, 2020 08:26 IST|Sakshi
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(ఫైల్‌ ఫొటో)

కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయగలిగాం

గతంలో కంటే రికవరీ రేటు పెరిగింది

యూఏఈ- ఇజ్రాయెల్‌ చారిత్రక ఒప్పందం

ఆఫ్గనిస్తాన్‌లో శాంతి స్థాపనకు చర్చలు

వాషింగ్టన్‌: మహమ్మారి కరోనా వ్యాప్తిని అమెరికా సమర్థవంతంగా కట్టడి చేయగలిగిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. యూరోపియన్‌ దేశాలతో పోలిస్తే అగ్రరాజ్యంలో 50 శాతం తక్కువ కరోనా మరణాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. జూలై నాటికి కోవిడ్‌-19 కేసులు 44 శాతం మేర తగ్గాయని.. ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణాంతక వైరస్‌పై పోరాడుతున్న ప్రతీ ఒక్కరు తమకు గర్వకారణమన్నారు. దేశ వ్యాప్తంగా గతంలో కంటే కరోనా రికవరీ రేటు బాగా పెరిగిందని, దేశంలో మహమ్మారి సంక్షోభం తుది దశకు చేరుకుందన్నారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి రాకపోయినా చాలా మంది కరోనాను జయిస్తున్న తీరు సానుకూల పరిణామమని పేర్కొన్నారు. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌, స్కూళ్లు, కాలేజీల పునః ప్రారంభం, యూఏఈ- ఇజ్రాయెల్‌ చారిత్రక ఒప్పందం తదితర అంశాల గురించి గురువారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.(చదవండి: ‘అంకుల్‌ని ఎలా చంపాడో కిమ్‌ నాతో చెప్పాడు’)

0.2శాతం కరోనా మరణాలు మాత్రమే.. అందుకే
‘‘సురక్షిత వాతావరణం కల్పిస్తూ స్కూళ్లను తెరవాలనుకుంటున్నాం. కోవిడ్‌-19 చిన్నారులపై అంతగా ప్రభావం చూపదు. 28 ఏళ్ల కంటే తక్కువ వయస్సున వారిలో 0.2 శాతం కంటే తక్కువ కరోనా మరణాలు నమోదయ్యాయి. 20 కాలేజీల నుంచి ఇటీవల సేకరించిన డేటా ప్రకారం, ఒక్కరంటే ఒక్క విద్యార్థికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదు. నిజానికి క్లాస్‌రూం బోధనతో పోలిస్తే ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా పాఠాలు చెప్పడం వల్ల పెద్దగా ఉపయోగం లేదని, నేరుగా పాఠాలు చెప్పే ప్రక్రియను ఇది భర్తీ చేయలేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.(చదవండి: అమెరికాలో ఇంతవరకు ఎవరికీ ఆ ఛాన్స్‌ రాలేదు!)

పాంపియో దోహాకు వెళ్తున్నారు..
‘‘వచ్చే వారం శ్వేత సౌధంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, ఇజ్రాయెల్‌ మధ్య చారిత్రక శాంతి ఒప్పందానికి సంబంధించిన సంతకాలు జరుగుతాయి’’అని ట్రంప్‌ వెల్లడించారు. అదే విధంగా.. అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో దోహా, ఖతార్‌కు పయనమవుతున్నారన్న ట్రంప్‌.. అఫ్గనిస్తాన్‌లో శాంతి స్థాపనకై సంబంధించిన చర్చలను ప్రారంభిస్తారని హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక ఘట్టానికి, సాహసోపేత నిర్ణయానికి ట్రంప్‌ పాలనా యంత్రాంగం కొన్నేళ్లుగా​ చేస్తున్న నిర్విరామ కృషే కారణమంటూ అధికారులపై ప్రశంసలు కురిపించారు. కాగా అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అక్కడ దాదాపు 1,91,567 మంది కోవిడ్‌తో మృత్యువాత పడగా.. మొత్తంగా 63,88,302 మందికి కరోనా సోకింది. (చదవండి: నోబెల్‌ శాంతి బహుమతికి ట్రంప్‌ నామినేట్‌)

మరిన్ని వార్తలు