అల్లకల్లోల అఫ్గాన్‌: సరిహద్దుల్లో 295 కి.మీ గోడ నిర్మిస్తున్న టర్కీ

17 Aug, 2021 20:02 IST|Sakshi

అంకార: తాలిబన్ల దురాక్రమణ అనంతరం అఫ్గనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో ఆ దేశ పౌరులు దేశాన్ని విడిచి వెళ్లేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. తాలిబన్లు దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని రోడ్డు, వాయు మార్గాలను దిగ్భంధించినప్పటికీ సామాన్య పౌరులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడ నుంచి బయటపడేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా తమ దేశంలోకి వచ్చే అక్రమ చొరబాటుదారులను అడ్డుకునేందుకు టర్కీ దేశం ఓ భారీ గోడను నిర్మిస్తోంది. ఇరాన్‌ సరిహద్దులో 295 కిమీ మేర గోడను నిర్మిస్తున్నట్లు టర్కీ అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డొగాన్‌ తాజాగా వెల్లడించారు.

ఈ గోడ నిర్మాణంలో సింహ భాగం ఇదివరకే  పూర్తైనట్లు ఆయన ప్రకటించారు. గత కొంతకాలంగా ఇరాన్‌ గుండా తమ దేశంలోకి అక్రమ చొరబాట్లు ఎక్కువయ్యాయని, వారి వల్ల తమ దేశం సమస్యలను ఎదుర్కొంటోందని, ఈ గోడ నిర్మాణం ద్వారా అక్రమ వలసలను పూర్తిగా అడ్డుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. సరిహద్దు ప్రాంతాలలో  సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దేశ భద్రతను కట్టుదిట్టం చేశామని ఆయన తెలిపారు. కాగా, అఫ్గాన్‌లో అంతర్యుద్ధం కారణంగా ప్రతి రోజు వేల సంఖ్యలో ఆ దేశ పౌరులు తూర్పూ సరిహద్దుల (ఇరాన్‌) గుండా టర్కీలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.  మరోవైపు టర్కీలో ఇప్పటికీ రెండు లక్షల మంది సిరియన్లు మరో ఆరు లక్షల మంది అఫ్గాన్లు శరణార్దులుగా ఉన్నారు. 
చదవండి: అఫ్గన్‌లో సాధారణ వాతావరణం: ఎందుకో అనుమానంగానే ఉంది!

మరిన్ని వార్తలు