Turkey Earthquake: టర్కీ, సిరియాలో 29,000 దాటిన భూకంప మృతులు..

12 Feb, 2023 15:52 IST|Sakshi

ఇస్తాన్‌బుల్‌: తుర్కియే(టర్కీ), సిరియాలో భూకంప మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శిథిలాలు తవ్వేకొద్ది వేల సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 29,000మందికిపైగా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. టర్కీలో 24,617 మంది, సిరియాలో 4,500 మంది మరణించినట్లు తెలిపారు. పరిస్థితి చూస్తుంటే ఈ సంఖ్య 50 వేలకు పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి అధికారులు అంచనా వేస్తున్నారు.

టర్కీ, సిరియా భూకంపం ప్రాంతాల్లో సహాయక చర్యలు ఏడో రోజూ కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారులు సహా అనేక మందిని సహాయక బృందాలు రక్షించాయి.  దక్షిణ టర్కీ హతాయ్ ప్రావిన్స్‌లో శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని 149 గంటల తర్వాత బయటకు తీశారు.

మరోవైపు టర్కీ దేశస్థులు తమ దేశంలోని బంధువుల ఇంట్లో తాత్కాలికంగా తలదాచుకోవచ్చని జర్మనీ తెలిపింది. ఈ విపత్కర పరిస్థితిలో తమవంతు సాయం అందిస్తామని చెప్పింది. ఇతర దేశాలు కూడా టర్కీకి ఆపన్నహస్తం అందిస్తున్నాయి. చైనా 53 టన్నుల టెంట్లను సాయంగా అందించింది. భారత్ ఇప్పటికే సహాయక బృందాలతో పాటు వైద్య బృందాలు, ఔషధాలు, ఇతర సామగ్రిని టర్కీకి పంపింది.
చదవండి: టర్కీ విధ్వంసం.. మూత్రం తాగి బతికిన యువకుడు

మరిన్ని వార్తలు