ట్రంప్‌ క్యాంపెయిన్ ఖాతాను బ్లాక్‌ చేసిన ట్విటర్‌

16 Oct, 2020 08:39 IST|Sakshi

న్యూయార్క్‌ : అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ క్యాంపెయిన్‌ ట్విటర్‌ ఖాతాను గురువారం కొద్దిసేపు నిలిచిపోయింది. ట్రంప్‌ క్యాంపెయిన్‌ ఖాతాను ట్విటర్‌ బ్లాక్‌ చేయడం పట్ల రిపబ్లికన్‌ సభ్యులు మండిపడ్డారు. దీనిపై తాము న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. సోషల్‌ మీడియా కంపెనీలు స్వేచ్ఛను హరిస్తూ స్పీచ్‌ పోలీస్‌గా వ్యవహరిస్తున్నాయని దీనికి ట్విటర్‌ బాధ్యత వహించాలని ఆరోపించారు. డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్‌ కుమారుడిపై ట్రంప్‌ బృందం ఓ వీడియాను పోస్ట్‌ చేయగా ఇది నిబంధనలకు విరుద్ధమని టీమ్‌ట్రంప్‌ ఖాతాను ట్విటర్‌ తాత్కాలికంగా నిలిపివేసింది.

ఉక్రెయిన్‌ ఇంధన కంపెనీతో హంటర్‌ బిడెన్‌ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలపై న్యూయార్క్‌ పోస్ట్‌ స్టోరీని ప్రస్తావిస్తూ ఈ వీడియోను రూపొందించారు. ఉక్రెయిన్‌తో లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని రిపబ్లికన్‌ సారథ్యంలోని సెనేట్‌ కమిటీలు నిగ్గుతేల్చాయని బిడెన్‌ క్యాంపెయిన్‌ ప్రతినిధి ఆండ్రూ బేట్స్‌ స్పష్టం చేశారు. ప్రైవేట్‌ సమాచారం పోస్ట్‌ చేయడం, హ్యాక్డ్‌ మెటీరియల్స్‌పై కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందున టీమ్‌ట్రంప్‌, వైట్‌హూస్‌ ప్రెస్‌ కార్యదర్శి కీలిగ్‌ మెననీ, న్యూయార్క్‌ పోస్ట్‌ల ఖాతాలను నిలిపివేశామని ట్విటర్‌ ప్రతినిధి వివరణ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పోస్టులను తొలగిస్తే తిరిగి ఆయా ఖాతాల నుంచి ట్వీట్లు చేయవచ్చని చెప్పుకొచ్చారు. చదవండి : అమెరికా ఎటువైపు?

మరిన్ని వార్తలు