బాత్రూముల్లో కంపు.. ట్విట్టర్‌ సిబ్బందికి చుక్కలు చూపిస్తున్న మస్క్‌

1 Jan, 2023 04:32 IST|Sakshi

వాషింగ్టన్‌: ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచీ సిబ్బందికి చుక్కులు చూపుతున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నిర్వాకాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఓవైపు పొదుపు చర్యలకు దిగుతుంటే పారిశుధ్య సిబ్బంది వేతన పెంపుకు డిమాండ్‌ చేయడంతో చిర్రెత్తుకొచ్చి వారందరినీ పీకిపడేశారు. దాంతో సరైన నిర్వహణ లేక బాత్రూములన్నీ భరించలేనంత కంపు కొడుతున్నాయని సిబ్బంది మొత్తుకుంటున్నారు.

చివరికి వాటిలో టాయ్‌లెట్‌ పేపర్లకు కూడా దిక్కు లేదట! వాటిని ఇంటి నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. పలు నగరాల్లోని ట్విట్టర్‌ కార్యాలయాల్లో సెక్యూరిటీ సిబ్బంది కూడా కరువయ్యారట! నిర్వహణ భారం తగ్గించుకునేందుకు ఉద్యోగులందరినీ రెండంతస్తుల్లోనే కుక్కి నాలుగింటిని ఖాళీ చేశారట. సియాటిల్, శాన్‌ఫ్రాన్సిస్కో కార్యాలయ భవనాలకు అద్దె చెల్లించడం కూడా ఆపేశారు. సిబ్బందిని వీలైనంత వరకూ వర్క్‌ ఫ్రం హోం చేయాలని చెబుతున్నారు. ట్విట్టర్‌ సిబ్బందిలో సగం మందిని తీసేయడం తెలిసిందే. టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ తదితర సొంత కంపెనీల నుంచి సిబ్బందిని ట్విట్టర్‌కు మస్క్‌ తరలిస్తున్నారట!

మరిన్ని వార్తలు