లి మెంగ్‌ యాన్‌ అకౌంట్‌ సస్పెండ్‌ చేసిన ట్విట్టర్‌

17 Sep, 2020 10:18 IST|Sakshi

బీజింగ్‌: కరోనా వైరస్‌ మహమ్మారి చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వూహాన్‌ ల్యాబ్‌లో తయారైందని హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ వైరాలజిస్టు డా. లి మెంగ్‌ యాన్‌ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయని యాన్‌ తెలిపారు. ఈ క్రమంలో ట్విట్టర్‌ ఆమెకు షాక్‌ ఇచ్చింది. తన అకౌంట్‌ను సస్పెండ్‌​ చేసినట్లు ప్రకటించింది. యాన్ ఖాతాను మంగళవారం తొలగించినట్లు డైలీ మెయిల్‌లోని ఒక నివేదిక తెలిపింది. ఆమె ట్విట్టర్‌ అకౌంట్‌ సస్పెండ్‌ చేయబడింది అనే మెసేజ్‌ వచ్చింది. నిబంధనలను ఉల్లంఘించే వారి ఖాతాలను ట్విట్టర్ నిలిపివేస్తుంది. అయితే యాన్ అకౌంట్‌ని సస్పెండ్ చేయడంపై ట్విట్టర్ ఇంకా స్పందించలేదు. కరోనా వైరస్‌కు సంబంధించి అవాస్తవ సమాచార వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవని మైక్రోబ్లాగింగ్ సైట్ మే నెలలో హెచ్చరికలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం యాన్‌ ఉల్లంఘించిన ట్విట్టర్‌ నియమాలు ఏంటనే దాని గురించి స్పష్టత లేదు. (కరోనా: ట్రంప్ సర్కార్‌‌ సంచలన నిర్ణయం)

హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరైన లి మెంగ్‌ కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనా ప్రభుత్వమే కారణమని మొదటినుంచి చెబుతూనే ఉన్నారు.  కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న సంగతి ప్రభుత్వానికి ముందే తెలుసునని ఆమె అన్నారు. పలు భద్రతా కారణాల దృష్ట్యా ఆమె హాంకాంగ్‌ నుంచి అమెరికాకు తరలివచ్చేశారు. సెప్టెంబర్‌ 11న ఓ షోలో ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్‌పై చేసిన పరిశోధనలు.. తాను  ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పంచుకున్నారు.

మరిన్ని వార్తలు