Afghanistan: అఫ్గాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా, మరి తాలిబన్ల పరిస్థితి ఏంటి?

23 Aug, 2021 18:06 IST|Sakshi

అఫ్గన్‌ నుంచి భారత్‌కు వచ్చిన వారిలో కరోనా 

146 మందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ కలకలం, మరోవైపు భారత్‌లో కరోనా మహమ్మారి మూడో దశ తరుముకొస్తున్న తరుణంలో కీలక పరిణామం ఆందోళన  పుట్టిస్తోంది. అఫ్గానిస్తాన్‌ సంక్షోభంతో మన దేశానికి తిరిగి వచ్చిన ప్రయాణీకుల్లో ఇద్దరికి కోవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ కావడం కలకలం రేపింది. 

సోమవారం అఫ్గానిస్తాన్‌నుంచి నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన 146 మందిలో ఇద్దరికి కోవిడ్-19 సోకింది. ఈవి షయాన్ని ఢిల్లీ ప్రభుత్వ నోడల్ ఆఫీసర్ రాజీందర్ కుమార్ ధృవీకరించారు. విదేశీయులకు అమలు చేస్తున్న ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించగా ఈ విషయం తేలిందన్నారు. వీరిని ఢిల్లీలోకి లోక్‌ నాయక్‌ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అయితే బాధితుల వివరాలు వెల్లడి కాలేదు. 

మరోవైపు తాలిబన్లకు వ్యతిరేకంగా అఫ్గన్ల ఆందోళన, కాబూల్‌ విమానాశ్రయంలో గుంపులు గుంపులుగా తరలివచ్చిన నేపథ్యంలో అక్కడి కరోనా వ్యాప్తి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. మరోవైపు తాలిబన్ల పరిస్థితి ఏంటనే వ్యాఖ‍్యలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు తాలిబన్లు మాస్క్ ధరించలేదంటూ స్పేస్‌ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌ విమర్శలను గుర్తు చేసుకుంటున్నారు.

చదవండి :  Afghanistan: తీవ్ర పరిణామాలు, అమెరికాకు తాలిబన్ల వార్నింగ్‌!

ఇక అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల ఆధీనంలోకి రావడం మొదలు జనం బెంబేలెత్తిపోతున్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగా దేశం విడిచి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజుకు రెండు విమానాల ద్వారా అక్కడ చిక్కుకున్న తమ పౌరులను తరలించేందుకు ఇండియా అనుమతి పొందింది.  ఇందులో భాగంగా కాబూల్ విమానాశ్రయంనుండి దోహా మీదుగా 146 మంది భారతీయులతో  కూడిన విమానం సోమవారం ఉదయం దేశ రాజధానికి చేరుకున్న సంగతి తెలిసిందే.

తొలివిడతలో ఆదివారం మూడు వేర్వేరు విమానాలలో 329 మంది పౌరులతో సహా దాదాపు 400 మంది తిరిగి వచ్చారు. వీరిలోభారత పౌరులతో పాటు సిక్కులు, అఫ్గన్‌ హిందువులున్నారు.  అలాగే అఫ్గాన్‌లో భారత  రాయబారి, ఇతర దౌత్యవేత్తలతో సహా దాదాపు 180 మంది ప్రయాణికులను సురక్షితంగా ఇప్పటికే భారత్‌కు చేరుకున్నారు.

చదవండి : Afghanistan: తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు.. అనుకున్నదే అయింది!

మరిన్ని వార్తలు