విమానం గాల్లోకి ఎగిరాక పైలట్ల డిష్యూం డిష్యూం.. ఏం జరిగిందంటే?

29 Aug, 2022 14:38 IST|Sakshi

పారిస్‌: విమానంలో ఏ చిన్న పొరపాటు జరిగినా పెను ప్రమాదానికి దారితీస్తుంది. విమానాలను నడిపే పైలట్లు ఎంతో నేర్పుతో, నైపుణ్యవంతులై ఉంటారు. సమన్వయంతో విమానాన్ని సురక్షితంగా తీసుకొస్తారు. అలాంటిది.. వారే విమానంలోని కాక్‌పుట్‌లో గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో హల్‌చల్‌ చేసి.. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారు. ఈ సంఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. పారిస్‌ నుంచి జెనీవాకు వెళ్తున్న ఎయిర్‌ ఫ్రాన్స్‌ విమానంలోని ఇద్దరు పైలట్లు గొడవకు దిగిన కారణంగా వారిని సస్పెండ్‌ చేశారు అధికారులు. 

పైలట్లు గత జూన్‌ నెలలో విమానం కాక్‌పిట్‌లో గొడవ పడినట్లు ఎయిర్‌లైన్స్‌ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. అయితే, కొద్ది క్షణాల్లోనే గొడవ సద్దుమణిగిందని, ఆ తర్వాత విమాన ప్రయాణం సాఫీగా కొనసాగినట్లు చెప్పారు. తమ ప్రవర్తనపై మేనేజ్‌మెంట్‌ నిర్ణయం కోసం పైలట్లు ఇన్నాళ్లు వేచి ఉన్నారని చెప్పారు. ఫ్రాన్స్‌ పౌర విమానయాన సంస్థ భద్రతా దర్యాప్తు సంస్థ నివేదిక బయటకు రావటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

జూన్‌లో జరిగిన సంఘటన నివేదిక ప్రకారం.. విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సమయానికే కాక్‌పిట్‌లో పైలట్‌, కోపైలట్‌ల మధ్య వివాదం మొదలైంది. దీంతో ఒకరు ఎదుటి వ్యక్తి కాలర్‌ పట్టుకున్నారు. దాంతో అతడిపై దాడి చేశారు మరొకరు. కాక్‌పిట్‌ నుంచి అరుపులు క్యాబిన్‌లోకి వినిపించినట్లు పలువురు తెలిపారు. దీంతో వారు వెళ్లి గొడవను ఆపారని, ఓ పైలట్‌ ఫ్లైట్‌ డెక్‌కు వెళ్లిపోయినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్‌ విద్యార్థితో జంప్‌

మరిన్ని వార్తలు