బీజింగ్ : ప్రపంచంలో మొట్టమొదటగా కరోనా వైరస్ పుట్టిన చైనాలో మళ్లీ కోవిడ్ కలకలం సృష్టిస్తుంది. ఇదివరకే కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో వ్యాధి మళ్లీ తిరగబెడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. వివరాల ప్రకారం..సెంట్రల్ చైనా ప్రావిన్స్ హుబీలో 68 ఏళ్ల మహిళకు డిసెంబర్లో కోవిడ్ నిర్ధారణ కాగా మళ్లీ దాదాపు ఆరు నెలల అనంతరం ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు పరీక్షలో తేలింంది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన మరో వ్యక్తికి సైతం ఏప్రిల్లోనే కోవిడ్ బారిన పడగా, ఈ వారం నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అయితే సదరు వ్యక్తిలో ఎలాంటి వైరస్ లక్షణాలు కనపడలేదు. అంతేకాకుండా వీరి కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల్లో ఒక్కరికి కూడా కోవిడ్ సోకకపోవడం గమనార్హం. అయినప్పటికీ వీరిని క్వారంటైన్లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. (వామ్మో.. చై'నో'..)
కోలుకున్న కరోనా రోగుల్లో తాజాగా మళ్లీ వ్యాధి తిరగపెట్టడం అరుదైన విషయం. అంతేకాకుండా కొందరు కోవిడ్ రోగుల్లో దీర్ఘకాలిక వ్యాధి లక్షణాలు కనిపిస్తుండటం మరిన్ని సందేహాలను రేకెత్తిస్తుంది. ఏదైనా వ్యాధి సంక్రమిస్తే మన శరీరంలో కొన్ని నెలల అనంతరం యంటీబాడీలు తయారవుతాయి. ఇవే తదనంతరం మళ్లీ ఆ వ్యాధి సోకకుండా ప్రతిరోధకాలుగా పనిచేస్తాయి. కానీ కోవిడ్ సోకిన కొన్ని నెలల్లోనే కొందరిలో వ్యాధి తిరగబడుతుంది. దీనికి రోగ నిరోధక శక్తే కారణమా లేదా ఇంకేదైనా అన్నది స్పష్టం కాలేదు. అయితే వ్యాధి నుంచి కోలుకున్న అనంతరం చనిపోయిన వైరస్ కణాల నుంచి అంటువ్యాధులు ప్రబలుతున్నాయేమో అని దక్షిణ కొరియా పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు అన్ని దేశాలకు కరోనా వైరస్ వ్యాపించిన సంగతి తెలిసిందే. (భారత్: కొత్తగా 64,553 కేసులు..1007 మరణాలు)