నీరవ్‌ మోదీకి భారీ షాక్‌‌: యూకే కోర్టు కీలక తీర్పు

25 Feb, 2021 16:57 IST|Sakshi

లండన్‌: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి లండన్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అతడిని భారత్‌కు తీసుకువచ్చేందుకు న్యాయస్థానం అంగీకరించింది. మనీలాండరింగ్‌ కేసులో భారత ప్రభుత్వం సమర్పించిన ఆధారాలు సరైనవేనన్న కోర్టు.. నీరవ్ మానసిక స్థితి సరిగా లేదన్న వాదనను కొట్టిపారేసింది. బ్యాంకుల ఉన్నతాధికారులతో లింక్‌ను ధ్రువీకరించిన న్యాయస్థానం... బోగస్ కంపెనీలు పెట్టి బ్యాంకులను అతడు మోసగించినట్టు నిరూపణ అయిందని పేర్కొంది.

ఈ క్రమంలో.. నీరవ్‌ మోదీపై మనీ లాండరింగ్‌ అభియోగాలు రుజువు కావడంతో గురువారం ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. అయితే తమ ఉత్తర్వులపై అప్పీలు చేసుకునే అవకాశం కల్పించింది. కాగా కోర్టు తీర్పుతో లండన్‌ ప్రభుత్వం అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ ఆర్థిక నేరగాడు స్వదేశానికి రానున్నాడు. కాగా బ్యాంకులకు రూ.13,700 కోట్లు టోకరా పెట్టి నీరవ్‌ మోదీ లండన్ పారిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు.

చదవండిప్రైవేటు బ్యాంకులకు సై

మరిన్ని వార్తలు