రూల్స్‌ బ్రేక్‌, చిక్కు‍ల్లో బ్రిటన్‌ ప్రధాని.. పెంపుడు కుక్కతో పార్క్‌కి వెళ్లి

15 Mar, 2023 13:30 IST|Sakshi

ప్రముఖులు ఏం చేసినా అవి వైరల్‌గా మారుతుంటాయి. ఈ అంశంలో దేశాధినేతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారు నడిచే నడక నుంచి, ప్రవర్తించే తీరు.. ఇలా ప్రతిదీ కెమెరా కంట పడుతుంది. అందుకే వాళ్లు కూడా చాలా జాగ్రత్తలు వహిస్తుంటారు. అయితే ఒక్కోసారి తెలిసో తెలియకో చిన్న చిన్న పోరపాట్లు చేస్తూ వార్తల్లోకెక్కుతుంటారు. ఈ తరహాలోనే ఇటీవల బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ వార్తల్లో నిలుస్తున్నారు. మొదట లాక్ డౌన్ చట్టం ఉల్లంఘణ, ఆ తర్వాత కారు సీటు బెల్టు పెట్టుకోనందుకు జరిమానా.. తాజాగా మరోసారి తన పెంపుడు కుక్క వల్ల రూల్స్‌ను బ్రేక్ చేసి చిక్కుల్లో పడ్డారు రిషి సునాక్‌. అసలేం జరిగిందంటే..

పెంపుడు కుక్కతో పార్క్‌కు..
ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ లండన్‌లోని హైడ్ పార్క్‌కు కాసేపు కాలక్షేపానికి వెళ్లారు. వారి వెంట తెచ్చుకున్న ఓ పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్లి ఆ పార్కులో వదిలేశారు. అయితే జంతువుల్ని అలా వదిలేయడం ఆ పార్క్‌ నిబంధనలకు విరుద్ధం. దీంతో పార్కులోకి వన్య ప్రాణులను బంధించి తీసుకురావాలన్న రూల్‌ను సునాక్ బ్రేక్ చేశారు. స్వేచ్ఛగా అక్కడ సంచరిస్తోన్న కుక్కను గమనించిన సిబ్బంది వెంటనే ప్రధాని వద్దకు వెళ్లి పార్క్‌ రూల్స్‌‌ను వివరించారు.


దీంతో పాటు సునాక్‌ పెంపుడు కుక్క మెడకు పట్టీ పెట్టి అందించారు. దీనంతటిని ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఇది కాస్తా దేశ వ్యాప్తంగా చర్చకు కారణంగా మారింది. గతంలొ కరోనా మహమ్మారి నిబంధనలు కట్టుదిట్టంగా అమలుచేస్తున్న సమయంలో ప్రధాని రిషి సునాక్ కారులో సీటు బెల్టు పెట్టుకోకుండా ప్రయాణించారు. రూల్స్ బ్రేక్ చేసినందుకు గానూ ఆయనకు ట్రాఫిక్ పోలీసులు 50 పౌండ్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. తాజాగా తన పెంపుడు కుక్క వ్యవహారంతో మరో సారి చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు