టెస్టుకు ముందు పళ్ల రసాలు.. కరోనా రిజల్ట్‌ తారుమారు?

26 Jun, 2021 18:55 IST|Sakshi

పండ్ల రసాలు, కెచప్‌లతో కొవిడ్‌ ఫేక్‌ పాజిటివ్‌!

కరోనా వైరస్‌, రెండో దఫా లాక్‌డౌన్‌ ప్రభావంతో మూతపడ్డ విద్యాసంస్థల్ని.. కొన్ని దేశాలు తెరవాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఇంగ్లండ్‌లో బడికి వెళ్లడం ఇష్టంలేని కొందరు పిల్లలు హుషారుతనం ప్రదర్శిస్తున్నారు. పండ్ల రసాల్ని, కెచప్‌లను ఉపయోగించి కరోనా పాజిటివ్‌ సర్టిఫికెట్లు సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ స్కూల్‌ యాజమాన్యం.. తల్లిదండ్రులకు పంపిన హెచ్చరిక సందేశం ద్వారా అసలు విషయం బయటపడింది.

లండన్‌: మెర్సెసైడ్‌లోని బెల్లె వాలేలో ఉన్న గేట్‌ఎకర్‌ స్కూల్‌ యాజమాన్యం తాజాగా పేరెంట్స్‌కి ఒక మెయిల్‌ పెట్టింది. ల్యాటెరల్‌ ఫ్లో టెస్ట్‌ (ర్యాపిడ్‌ తరహా టెస్ట్‌) టైంలో చాలామంది పిల్లలు ఆరెంజ్‌, కచెప్‌.. ఇతరత్రా పండ్లరసాలు తాగుతున్నారని, దాంతో స్వాబ్‌ నమూనాలు మారిపోయి.. ఫలితం తేడా వస్తోందని తెలిపింది. దాని ద్వారా అంతా బాగానే ఉన్న పిల్లలకు కరోనా పాజిటివ్‌ రిజల్ట్‌ వస్తోందని, ఇలాంటి తప్పుడు పనులను తాము సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆ మెయిల్‌లో హెచ్చరించింది. జూన్‌ 21 సోమవారం నుంచి నిర్వహిస్తున్న టెస్టుల్లో వరుసబెట్టి ఆ స్కూల్‌ పిల్లలకు పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయట. ఆ అనుమానంతోనే ఈ మెయిల్‌ పంపింది స్కూల్‌. అయితే వాళ్లలో ఎంత మంది ఇలాంటి పనికి పాల్పడ్డారనేది తేలాల్సి ఉంది. 

అదే టైంలో బ్రిటన్‌ వ్యాప్తంగా చాలా స్కూళ్లలో స్టూడెంట్స్‌ ఇలాంటి చేష్టలకు పాల్పడినట్లు రుజువైందని, అందుకే తమ స్కూల్‌ పిల్లలపై కూడా అనుమానంతోనే ఆ మెయిల్‌ పంపామని స్కూల్‌ యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. అంతేకాదు ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ రిపోర్టులనే తాము నమ్ముతామని పేరెంట్స్‌కి స్పష్టం చేసింది. మరోవైపు పండ్ల రసాలు, ఫిజ్జీలాంటి జ్యూస్‌లతో ఇలాంటి చేష్టలకు పాల్పడుతూ కొందరు టిక్‌టాక్‌లు చేస్తుండడంతో స్టూడెంట్స్‌పై ప్రభావం పడుతోందని అధికారులు భావిస్తున్నారు.

చదవండి: వుహాన్‌ ల్యాబ్‌కు ఈ ఏడాది నోబెల్‌!!

మరిన్ని వార్తలు