అలర్జీ ఉంటే వ్యాక్సిన్‌ వద్దు

10 Dec, 2020 02:20 IST|Sakshi

బ్రిటన్‌లో ఫైజర్‌ టీకా వాడిన ఇద్దరికి అస్వస్థత

లండన్‌: కరోనాను తరిమికొట్టేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించి 24 గంటలు గడవకుండానే సమస్యలు తలెత్తాయి. ఫైజర్‌– బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న నేషనల్‌ హెల్త్‌ సర్వీసుకి చెందిన ఇద్దరు వర్కర్లు తీవ్ర అస్వస్థతకి లోనయ్యారు. వ్యాక్సిన్‌ తీసుకున్న ఒక్క రోజులోనే వారికి ఒళ్లంతా దద్దుర్లు, రక్తప్రసరణలో తేడాలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో  యూకే డ్రగ్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ అప్రమత్తమైంది.

ఏదైనా మందులకుగానీ, ఆహార పదార్థాలకు గానీ అలర్జీ వచ్చే వాళ్లు ఎవరూ కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడానికి రావద్దని హెచ్చరించింది. వ్యాక్సినేషన్‌ తీసుకోవడానికి వచ్చిన వారి మెడికల్‌ హిస్టరీని పరిశీలించాలని ఆదేశించింది. ఎవరికైనా అలర్జీలు ఉన్నాయని తేలితే వారికి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వొద్దని ఉత్తర్వులు జారీ చేసింది.  ‘‘ఏదైనా వ్యాక్సిన్‌ ఇచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న సైడ్‌ ఎఫెక్ట్‌లు రావడం సర్వసాధారణమే. ఎందుౖనా మంచిదని వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వచ్చే వారి మెడికల్‌ హిస్టరీ చూడాలని చెప్పాము.  ప్రస్తుతం ఆ హెల్త్‌ వర్కర్లు ఇద్దరూ కోలుకుంటున్నారు. వారి ఆరోగ్యం బాగుంది’’ అని అధికారులు చెప్పారు. 

మరిన్ని వార్తలు