కరోనాపై 141 రోజుల పోరాటం...

3 Aug, 2020 15:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటన్‌కు చెందిన 35 ఏళ్ల ఫాతిమా బీడిల్‌ సుదీర్ఘకాలం పాటు, అంటే 141 రోజులపాటు కోవిడ్‌–19 తో పోరాటం చేసి విజయం సాధించారు. అన్ని రోజుల్లో ఆమె 105 రోజులపాటు వెంటిలేటర్‌పై, 40 రోజులపాటు కోమాలోకి వెళ్లి కోలుకోవడం విశేషమని ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌‌ జనరల్‌ ఆస్పత్రి వైద్య వర్గాలు తెలిపాయి. బహుశ కోవిడ్‌–19 పై ఇంతకాలంపాటు పోరాటం చేసి గెలిచిన తొలి రోగి, మహిళ ఫాతిమా బీడిల్‌లే కావచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. బీడిల్‌ మొరాకోలోని ఇస్లాం పవిత్ర మందిరాల సందర్శనకు వెళ్లినప్పుడు ఆమెకు కరోనా సోకినట్లు తెలుస్తోంది.

తాను వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు ఛాతిలో భయంకరపైన నొప్పితో బాధ పడ్డానని, తాను బతుకుతానని ఏ కోశానా నమ్మకం కలగలేదని ఆమె స్థానిక మీడియాకు ఆదివారం తెలిపారు. తాను బతికి బయటపడడానికి ఎన్‌హెచ్‌ఎస్‌ ఆస్పత్రి వైద్య సిబ్బందే కారణమని, వారిని మెడల్స్‌తో సత్కరించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. కాగా, బీడిల్‌ రెండు ఊపిరితిత్తులకు వైరస్‌ సోకగా, ఒకటి పూర్తిగా దెబ్బతిన్నది. ఇక ఆమె జీవిత కాలంలో ఆ ఊపిరితిత్తి మెరగుపడే అవకాశం లేదని, ఒకే ఊపిరితిత్తితోనే బతకాల్సి ఉంటుందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. (అమెరికాలో విస్తృతంగా వ్యాప్తిస్తోన్న కరోనా..)

మరిన్ని వార్తలు