Ukraine War: అమెరికా అడిగినా పట్టించుకోలేదు! పుతిన్‌ అడగ్గానే..

18 Apr, 2022 18:26 IST|Sakshi

ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో అమెరికా మాటల్ని, అధ్యక్షుడు బైడెన్‌ హెచ్చరికల్ని మొదటి నుంచి పెడచెవిన పెడుతున్న సౌదీ అరేబియా.. ఇప్పుడు మరో కవ్వింపు చర్యకు పాల్పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నేరుగా ఆయిల్‌ మార్కెట్‌ వ్యవహారాలపై చర్చలు నడిపింది. 

ప్రస్తుతం ఉన్న సంక్షోభ పరిస్థితుల్లో.. ప్రపంచ ఆయిల్‌ మార్కెట్‌ను స్థిరపరిచేందుకు ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు ఓపెక్‌ప్లస్‌ ఉత్పత్తి గ్రూపుతో సమన్వయం కొనసాగించనున్నట్లు క్రెమ్లిన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్యలు మొదలయ్యాక.. పుతిన్‌, సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ మొహమ్మద్ బిన్ సల్మాన్ నేరుగా ఫోన్‌లో మాట్లాడుకోవడం ఇది రెండోసారి. 

అంతకు ముందు.. ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో చమురు ధరలు విపరీతంగా పెరగడంతో.. సౌదీ అరేబియా , ఇతర ప్రధాన పర్షియన్ గల్ఫ్ దేశాలను చమురు ఉత్పత్తులు పెంచాలంటూ అమెరికా ఇచ్చిన పిలుపును అవి ప్రతిఘటించాయి.ఇందుకు అమెరికా, రష్యాపై విధించిన ఆంక్షలు కూడా ఒక కారణమే!. అయితే పుతిన్‌తో శనివారం, చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్‌తో శుక్రవారం వరుస చర్చలు జరిపిన సౌదీ క్రౌన​్‌ ప్రిన్స్‌.. ఆయిల్‌ మార్కెట్‌ నియంత్రణకు ప్రయత్నిస్తామన్న హామీ ఇవ్వడం విశేషం. 

 చమురు ధరల నియంత్రణతో పాటు అమెరికాకు చిర్రెత్తిపోయేలా ద్వైపాక్షిక ఒప్పందాలకు గురించి కూడా.. సౌదీ-రష్యాల మధ్య చర్చలు జరిగినట్లు సౌదీ అధికారిక వర్గాలే ఒక ప్రకటనలో  ప్రస్తావించడం గమనార్హం.

మరిన్ని వార్తలు