నోబెల్ శాంతి బహుమతికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు!.. అయ్యేనా?

18 Mar, 2022 15:22 IST|Sakshi

రష్యా డిమాండ్‌కు తలొగ్గకుండా ఉన్న సైన్యం, సాధారణ పౌరులు, బయటి దేశాల నుంచి అందుతున్న అరకోర సాయంతో పోరాడుతున్నాడు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ. ఆయన ఉద్దేశం ఏదైనా, విమర్శలు ఉన్నా.. త్వరగా దేశాన్ని రష్యా గప్పిట్లోకి వెళ్లనీయకుండా చేస్తున్న తీరుపై అభినందనలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఓ అరుదైన ఘనత దక్కాలని కోరుకుంటున్నారు కొందరు. 

యూరోపియన్‌ రాజకీయవేత్తలు కొందరు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ పేరును నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ చేస్తున్నారు. ఈ మేరకు నార్వేకు చెందిన నోబెల్‌ శాంతి కమిటీకి విజ్ఞప్తులు పంపిస్తున్నారు. అధికారంలో ఉన్న నేతలతో పాటు మాజీలు కొందరు ఈ రిక్వెస్ట్‌ చేసిన వాళ్లలో ఉన్నారు. 

శాంతి బహుమతి కమిటీకి మేం వినమ్రంగా మా విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకోమని కోరుతున్నాం. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోపాటు ఉక్రెయిన్‌ ప్రజలనూ శాంతి బహుమతికి మేం నామినేట్‌ చేస్తున్నాం. ఈ కారణం వల్లనే నామినేషన్ల స్వీకరణను తిరిగి తెరవాలని, మార్చి 31వ తేదీ వరకు స్వీకరణ తేదీని పొడిగించాలని కోరుతున్నాం అని ఆ ప్రకటనలో ఉంది. మార్చి 11వ తేదీనే ఈ ప్రకటనను రిలీజ్‌ చేశారు ఐరోపా దేశాల నేతలు.

ఇదిలా ఉండగా.. కమిటీ నుంచి ఈ ప్రకటనపై స్పందన రాలేదు. నోబెల్‌ శాంతి బహుమతికి సంబంధించిన ప్రకటన.. అక్టోబర్‌ 3-10 తేదీల మధ్య జరగనుంది. 2022 నోబెల్‌ శాంతి బహుమతి కోసం 92 సంస్థలు, 251 మంది వ్యక్తిగతంగా దరఖాస్తులు చేసుకున్నారు.

చదవండి: జెలెన్‌ స్కీ ఆవేదనలో అర్థం ఉందా?

మరిన్ని వార్తలు