Ukraine-Russia war: రష్యాకు లక్ష, మాకు 13 వేలు సైనిక నష్టంపై ఉక్రెయిన్‌

3 Dec, 2022 06:10 IST|Sakshi

కీవ్‌: రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకుంటోంది. యుద్ధం మొదలైన ఈ తొమ్మిది నెలల కాలంలో దాదాపుగా 13 వేల మంది ఉక్రెయిన్‌ సైనికులు మరణించినట్టు అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదార మైఖైలో పోడోల్యాక్‌  వెల్లడించారు. వీరిలో సాధారణ పౌరులే అధికమన్నారు. రష్యా సైనికులు లక్ష మంది దాకా మరణించినట్టు అంచనా వేశామన్నారు. లక్షన్నర మంది గాయపడి ఉంటారని తెలిపారు.

ఉక్రెయిన్‌ వైపు చనిపోయిన, గాయపడ్డ వారి సంఖ్య లక్ష దాకా ఉంటుందని యూరోపియన్‌ యూనియన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్‌ లెయెన్‌ చెప్పారు. రష్యా, ఉక్రెయిన్‌ రెండు పక్షాల్లో కలిపి మృతుల సంఖ్య లక్ష వరకు ఉంటుందని అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ మార్క్‌ మిల్లీ అన్నారు. ఉక్రెయిన్‌ పౌరులు 40 వేల మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇక ఇరువైపులా కలిపి 6,655 మంది పౌరులు మరణించారని, 10, 368 మంది గాయపడ్డారని ఐక్యరాజ్య  సమితి మానవ హక్కుల కమిషన్‌ వెల్లడించింది. సైనికులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఐరాస వెల్లడించలేదు.

మరిన్ని వార్తలు