ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు భారీ ప్రాణ నష్టం.. ఎన్ని వేల మంది సైనికులు చనిపోయారంటే..?

27 Aug, 2022 19:11 IST|Sakshi

కీవ్‌: రష్యాతో ఆరు నెలలుగా జరుగుతున్న యుద్ధంలో ఆ దేశానికి చెందిన 45,550 మంది సైనికులను మట్టబెట్టినట్లు ఉక్రెయిన్ శనివారం వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 250 రష్యా బలగాలను హతమార్చినట్లు ఉక్రెయిన్ ఆర్మీ జనరల్ స్టాఫ్‌ ఫేస్‌బుక్ వేదికగా తెలిపారు. అంతేకాదు ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న ఈ భీకర పోరులో రష్యాకు చెందిన 2,000 యుద్ధ ట్యాంకులు, 1,045 ఆయుధ వ్యవస్థలు, 836 డ్రోన్లు, 3,165 వాహనాలను ఉక్రెయిన్ సేనలు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. 

ఉక్రెయిన్ చెప్పిన లెక్కలకు ఆధారాలు లేకపోయినప్పటికీ ఇటీవల బ్రిటన్ రక్షణమంత్రి బెన్ వాలేస్‌ అంచనాలకు ఇవి దాదాపు సమానంగా ఉన్నాయి. యుద్ధంలో రష్యాకు ఇప్పటివరకు మొత్తం 80వేల మంది ప్రాణ నష్టం జరిగి ఉండవచ్చని ఆయన ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు. 

అమెరికాకు న్యూయార్క్ టైమ్స్‌ నివేదిక మాత్రం యుద్ధంలో 25 వేల మంది రష్యా సైనికులు మరణించి ఉంటారని అంచనా వేసింది. అలాగే 9000 మంది ఉక్రెయిన్‌ సైనికులు రష్యా దాడుల్లో ప్రాణాలు కోల్పోయి ఉంటారని పేర్కొంది. 

రష్యా దాడుల్లో 5,587మంది ఉక్రెయిన్ పౌరులు మరణించి ఉంటారని కచ్చితంగా చెప్పగలమని ఐక్యరాజ్య సమితి ఇటీవల వెల్లడించింది. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది.

మరోవైపు యుద్ధంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ తేల్చి చెప్పింది. తాము ఒకవేళ నాటోలో చేరాలనే ఆలోచన మార్చుకున్నా యుద్ధాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేసింది.
చదవండి: అంతా చీకటే.. షింజో అబే హంతకుడి ఆవేదన

>
మరిన్ని వార్తలు