మగాళ్లను భయపెట్టి సొంతిట్లో ఆడవాళ్లపై అత్యాచారం

26 Mar, 2021 19:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూయార్క్‌ : ఇథియోపియాలోని టిగ్రే జాతిపై సరిహద్దు దేశం ఎరిట్రియా సైనికులు దారుణాలకు పాల్పడుతున్నట్లు యునైటెడ్‌ నేషన్స్‌ ప్రతినిధి వాఫా గురువారం మీడియాకు వెల్లడించారు. దాదాపు 516 మంది అత్యాచారానికి గురయ్యారని, ఆ సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉండొచ్చని ఆమె అన్నారు. వాఫా మాట్లాడుతూ.. ‘‘ ఎరిట్రియా సైనికులు టిగ్రే జాతి వారు నివసించే ప్రాంతాల్లోకి చొరబడి మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారు. కుటుంబసభ్యుల కళ్లెదుటే ఈ దారుణానికి పాల్పడుతున్నారు. కుటుంబంలోని మగాళ్లను భయపెట్టి వారితోటే సొంతిట్లోని ఆడవాళ్లపై అత్యాచారం చేయిస్తున్నారు. మెకెల్లే, అడిగ్రట్‌, ఉక్రో, షిరేలోని మెడికల్‌ సెంటర్లలో దాదాపు 516 అత్యాచార కేసులు నమోదయ్యాయి. చాలా వరకు మెడికల్‌ సెంటర్లు సరిగా పనిచేయటం లేదు’’ అని పేర్కొన్నారు.

దీనిపై ఇథియోపియా యూన్‌ఎన్‌ అంబాసిడర్‌ టాయే అస్కేసెలస్సీ అంబ్‌డే స్పందించారు. ఈ అత్యాచార ఆరోపణలను తమ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని చెప్పారు. నిజానిజాలు తేల్చటానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ ఘటనపై ఎరిట్రియా సమాచార శాఖ మంత్రి యమనె గెబ్రెమెస్కెల్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అత్యాచార ఘటనలు ఎరిట్రియా సమాజానికి అసహ్యమన్నారు. అలాంటివి జరిగినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు