న్యూయార్క్: మహిళలు, యువత భాగస్వామ్యంతోనే అఫ్గనిస్తాన్లో సమగ్ర పరిపాలన సాధ్యమని ఐక్యరాజ్యసమితి అసిస్టెన్స్ మిషన్ (యూనైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ (యూఎన్ఏఎంఏ)) స్పష్టం చేసింది. అఫ్గనిస్తాన్ను స్వాధీనం చేసుకున్న దాదాపు మూడు వారాల అనంతరం తాలిబన్లు కొత్త ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో పరిపాలన విధానంలో యువత, మహిళలకు అవకాశం ఇవ్వకూడదనే తాలిబన్ల ఆలోచన తీరును యూఎన్ తీవ్రంగా ఖండించింది. అంతేకాదు వారి భాగస్వామ్యం లేని పరిపాలన విధానం అర్థరహితమైనదని పేర్కొంది. (చదవండి: Afghanistan: అఫ్గాన్లో ఆపద్ధర్మ ప్రభుత్వం )
తాలిబన్లు హింసా ప్రవృత్తి మానుకోవాలి.. దేశంలో శాంతి, సుస్థిర సౌభ్రాతత్వం అనేవి సమగ్ర పాలన పైనే ఆధారపడి ఉంటాయని యూఎన్ఏఎంఏ నొక్కి చెప్పింది. భావప్రకటనా స్వేచ్ఛ, శాంతియుత జీవన విధానం అనేవి అఫ్గాన్ ప్రజల ప్రాథమిక హక్కులని గుర్తు చేసింది. తిరుగుబాటుదారులు, పాత్రికేయుల పట్ల హింసా ప్రవృత్తిని ప్రదర్శంచకూడదంటూ హితవు పలికింది. ఆఫ్గాన్లోని బాలికలు, మహిళలకు అండగ ఉంటామని, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వారికి పూర్తి మద్ధతు ఇస్తున్నట్లు యూఎన్ఏఎంఏ ప్రకటించింది.