షాకింగ్‌ ఘటన: విమాన చక్రంలో మనిషి మృతదేహం

24 Dec, 2022 17:50 IST|Sakshi

గాంబియా నుంచి బ్రిటన్‌కు వెళ్లిన జెట్‌ విమానంలో ఒక షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. విమానం వీల్‌ బేలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. టీయూఐ ఎయిర్‌వేస్‌ నడుపుతున్న జెట్‌ విమానంలో గుర్తు తెలియని ఒక నల్లజాతీయుడు మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. డిసెంబర్‌5, 2022న గాంబియా రాజధాని బంజుల్‌ నుంచి లండన్‌లోని గాట్విక్‌ మిమానాశ్రయానికి విమానం బయలుదేరింది.

సరిగ్గా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయినప్పుడే ఈ దిగ్బ్రాంతికర ఘటనను గుర్తించారు అధికారులు. ఈ మేరకు బ్రిటన్‌ మెట్రో పోలీసులు గాంబియా ప్రభుత్వానికి ఈ సమాచారం అందించారు. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా ఒక అపరిచిత వ్యక్తి విమానం వీల్‌ బేలో మృతి చెంది ఉన్నట్లు తెలిపారు. ఈ మృతదేహాన్ని విమానం నుంచి తొలగించి వర్థింగ్‌ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.

గాంబియన్‌ అధికారులు బ్రిటన్‌ పోలీసులకు సహకరించడమే కాకుండా మృతదేహానికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు యూకే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు మొదటిసారి కాదు.  2019లో ఆమ్‌స్టర్‌డామ్‌లోని పోలీసులు కెన్యా నుండి వచ్చిన కార్గో విమానం ముక్కు చక్రంలో ఒక వ్యక్తి అక్రమంగా ప్రవేశించి మరణించాడు.

(చదవండి: కారుతో ఢీకొట్టి చంపినందుకు.. రూ 90 లక్షలు జరిమానా)

మరిన్ని వార్తలు