మూడు వారాల పాటు ఖాతా బ్లాక్.. మస్క్ తీరుతో అసంతృప్తి.. ‘మరోదారి చూసుకుంటాం, మీకో దండం’

27 Nov, 2022 11:12 IST|Sakshi

ట్విట్టర్ కొత్త సీఈఓ ఎలాన్ మస్క్‌ తీరుపై అసంతృప్తితో స్లొవెేనియా అధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ సామాజిక మాధ్యమానికి తాము దూరంగా ఉండనున్నట్లు తెలిపింది. ట్విట్టర్‌లో తమ పార్టీ కార్యకలాపాలు ఉండవని ప్రకటించింది. ప్రజలకు చేరువ కావడానికి ఈ వేదిక తప్పనిసరి అని తాము భావించడం లేదని చెప్పింది.

స్లొవేనియాలో ప్రస్తుతం ఫ్రీడం మూమెంట్‌ పార్టీ(జీఎస్‌) అధికారంలో ఉంది. సాంకేతిక కారణాలు చూపి ఈ పార్టీ అధికారిక ఖాతాను ట్విట్టర్ మూడు వారాల పాటు బ్లాక్ చేసింది. ఆ తర్వాత కూడా తిరిగి పునరుద్ధరించలేదు. అదీ కాకుండా ట్విట్టర్‌లో విద్వేష ప్రసంగాలు, తప్పుడు వార్తలపై జోరుగా ప్రచారం జరగడం తమకు ఆందోళన కల్గిస్తోందని, ఎలాన్ మాస్క్ సీఈఓ అయ్యాక పరిస్థితి ఇంకా మారిపోయిందని పార్టీ శనివారం ప్రకటన విడుదల చేసింది. అందుకే తాము ఈ ప్లాట్‌ఫాంకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఇతర ప్రత్యామ్నాయాల ద్వారా ప్రజలకు చేరువవుతామని పేర్కొంది.

మొత్తం 91 స్థానాలున్న స్లొవెేనియా పార్లమెంటులో 41 సీట్లు కైవవం చేసుకుని ఈ ఏడాది ఏప్రిల్‌లో అధికారంలోకి వచ్చింది జీఎస్ పార్టీ. అయితే మాజీ ప్రధాని రాబర్ట్ గాలోబ్ ట్విట్టర్‌ను బాగా వినియోగించుకునేవారు. ఈ ప్లాట్‌ఫాం ద్వారానే ప్రతిపక్షం, మీడియాపై తరచూ విమర్శలు గుప్పించేవారు. కానీ ఎన్నికల్లో ఓడిపోయారు. తాము అధికారంలోకి వస్తే రాజకీయాల్లో మళ్లీ మర్యాదపూర్వక వాతావరణాన్ని తీసుకొస్తామని, సమన్యాయ పాలన అందిస్తామని జీఎస్ పార్టీ హామీ ఇచ్చింది. రాబర్ట్ గాలోబ్ మాత్రం వీటిని విస్మరించి ఓటమి పాలయ్యారు.
చదవండి: లాక్‌డౌన్ ఇంకా ఎన్నాళ్లు? చైనాలో వెల్లువెత్తిన నిరసనలు..

మరిన్ని వార్తలు