ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు! తెగేసి చెప్పిన యూఎస్‌

9 Apr, 2022 18:58 IST|Sakshi

US Says Absolutely No Truth: పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం జరుగుతున్న​ సంగతి తెలిసిందే. అదీగాక పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పాలన పట్ల విముఖతతో ఉన్న ప్రతిపక్షాల తోపాటుగా సొంత పార్టీ అభ్యర్థులు కూడా ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు యత్నించారు కూడా. అయితే ఈ సంక్షోభానికి కారణం యూఎస్‌ అని ఇమ్రాన్‌ ఖాన్‌ గతంలోనే కొన్ని మిమర్శలు చేశారు. ప్రతిపక్ష పార్టీల సహాయంతో తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి వాషింగ్టన్‌లో కుట్ర పన్నారని, ఇదంత విదేశీ కుట్ర అని ఆరోపణలు చేశారు.

తన స్వతంత్ర విదేశాంగ విధానం కారణంగా తనపై ప్రతి పక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేలా చేసిందని విమర్శలు గుప్పించారు. అయితే యూఎస్‌ అప్పుడే ఆరోపణలన్నింటిని తోసిపుచ్చింది కూడా. ఈ మేరకు శుక్రవారం ఇమ్రాన్‌ ఖాన్‌ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మ‍ళ్లీ తాజాగా యూఎస్‌ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు.

యూఎస్‌లోని ఒక సీనియర్‌ దౌత్యవేత్త పాకిస్తాన్‌లో పాలన మార్పుల పై బెదిరింపులకు దిగారంటూ ఆరోపణలు పునరుద్ఘాటించారు. విదేశాంగ శాఖలోని బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ డొనాల్డ్ లూ తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ‘విదేశీ కుట్ర’లో పాలుపంచుకున్నారని కూడా ఖాన్ ఆరోపించారు.

అయితే యూఎస్‌ డిప్యూటీ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి జలీనా పోర్టర్ తాజా ఆరోపణలనింటిని ఖండించడమే కాకుండా వాటిలో ఏ మాత్రం నిజం లేదని తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు. తాము పాకిస్తాన్‌లో ఎదురవుతున్న పరిణామాలను గమనిస్తున్నామన్నారు. అంతేగాదు తాము పాకిస్తాన్ రాజ్యాంగ ప్రక్రియ, చట్ట నియమాలను గౌరవించడమే కాకుండా మద్దతు ఇస్తాం అని చెప్పారు. ఇలా ఖాన్‌ ఆరోపణలను అమెరికా బహిరంగంగా ఖండిచడం మూడోసారి.

(చదవండి: భారత్‌పై పొగడ్తల ఎఫెక్ట్‌.. ఇమ్రాన్‌ ఖాన్‌పై నవాజ్‌ కూతురి తీవ్ర విమర్శలు)

మరిన్ని వార్తలు