కాబూల్‌ దాడుల సూత్రధారిని మట్టుపెట్టిన దళాలు.. బరిలోకి తాలిబన్లు కూడా!

28 Aug, 2021 09:48 IST|Sakshi

US Revenge Attacks On ISIS: తమ సైనికులను పొట్టనపెట్టుకున్న ఐసిస్‌ ఉగ్రవాద సంస్థపై అమెరికా ప్రతీకార వేట మొదలైంది. ‘వెంటాడి.. వేటాడి మట్టుపెడతామ’ని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించి కొన్ని గంటలు గడవకముందే.. దాడులకు దిగి లక్క్ష్యం పూర్తి చేసింది. శుక్రవారం సాయంత్రం దాటాక నంగహర్‌ ప్రావిన్స్‌లోని ఐసిస్‌ ఖోరసాన్‌ ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన అమెరికా దళాలు.. వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో కాబూల్‌ జంట పేలుళ్ల సూత్రధారిని మట్టుపెట్టినట్లు సమాచారం.

ఐసిస్‌-కే గ్రూపు లక్క్ష్యంగా శుక్రవారం ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా దళాలు ప్రకటించుకున్నాయి. అఫ్గన్‌ భూభాగం అవతలి నుంచే రీపర్ డ్రోన్ సహాయంతో ఈ దాడికి పాల్పడింది. కాబూల్‌ పేలుళ్ల సూత్రధారి ఓ వాహనంలో వెళ్తుండగా గుర్తించి.. ఆ పక్కా సమాచారంతో దాడి నిర్వహించింది. ఈ దాడిలో ఆత్మాహుతి దాడుల వ్యూహకర్తతో పాటు అతని సహాయకుడు మృతిచెందాడని, సాధారణ పౌరులెవరికీ ఏం కాలేదని సెంట్రల్‌ కమాండ్‌ కెప్టెన్‌ బిల్‌ అర్బన్‌ ఓ ప్రకటనలో స్పష్టం చేశాడు.

మధ్య ఆసియా దేశాల్లోని అమెరికన్ ఆర్మీ బేస్ నుంచి నిర్వహించిన ఈ ఆపరేషన్ సక్సెస్‌ అయినట్లు వైట్‌ హౌజ్‌ దళాలు ప్రకటించుకున్నాయి. మరోవైపు కాబూల్‌ దాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. బలగాల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు ప్రకటించింది. ఇంకోవైపు ఎయిర్‌పోర్ట్‌ బయట సాధారణ పౌరులు ఉండకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. గురువారం రాత్రి కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర జరిగిన జంట బాంబు పేలుళ్లలో 13 మంది యూఎస్‌ సైనికులు, 78 మంది పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే.  చదవండి: కాబూల్‌ దాడులు.. ట్రంప్‌ భావోద్వేగం

బరిలోకి తాలిబన్లు
ఐసిస్-కే ఉగ్రవాద సంస్థపై అమెరికాతో పాటు తాలిబన్లు ప్రతీకార చర్యలకు దిగారు. మరిన్ని దాడులకు ఐసిస్‌-కే పథక రచన చేస్తుందన్న సమాచారం మేరకు తాలిబన్‌ బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఈ మేరకు కాబూల్‌లో ఇంటింటినీ గాలిస్తున్న తాలిబన్ బలగాలు.. ఇప్పటికే ఐసిస్-కే సానుభూతిపరులు, మద్ధతుదారులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల ద్వారా దాడులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు.

చదవండి: ఐసిస్‌ ఖోరసాన్‌- వీళ్లెంత దుర్మార్గులంటే..

క్లిక్‌ చేయండి: కాబూల్‌ పరిస్థితి- వాటర్‌ బాటిల్‌ 3 వేలు.. ఫుడ్‌ ప్యాక్‌ 7 వేలు

మరిన్ని వార్తలు