వ్యా‍క్సిన్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం : ట్రంప్‌ సంచలనం

12 Dec, 2020 09:25 IST|Sakshi

మహమ్మారితో అతలాకుతలమైన అమెరికన్లకు భారీ ఊరట

ఫైజర్ టీకాకు అమెరికా ఆమోదం,  అందరికీ ఉచితం

24 గంటల్లో వ్యాక్సినేషన్ ప్రారంభం

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారితో అతలాకుతలమైన అమెరికావాసులకు ఎట్టకేలకు ఊరట లభించనుంది. అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్-జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వైరస్‌ టీకా అత్యవసర వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)అనుమతి లభించింది.  గురువారం 8 గంటల పాటు జరిపిన బహిరంగ చర్చ అనంతరం ఈ ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్‌ తొలి డోస్‌ను 24 గంటల్లో ఇవ్వనున్నారు.  (ఫైజర్‌ వ్యాక్సిన్‌ వినియోగానికి అమెరికా ఓకే)

కోవిడ్-19 అంతానికి ఫైజర్ బయోఎన్‌టెక్ టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం తెలుపుతున్నామని ఎఫ్‌డీఏ చీఫ్ సైంటిస్ట్ డెనైజ్ హింటన్ పేర్కొన్నారు. మరోవైపు అమెరికన్లందరికీ ఫైజర్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కేవలం తొమ్మిదినెలల్లోనే అద్భుతమైన విజయాన్ని సాధించామని, ఇది నిజంగా శుభవార్త అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.  సైన్సుపరంగా చరిత్రలో ఇదొక చారిత్రాత్మక సందర్బమని పేర్కొన్నారు. మొదటి టీకాను ఎవరు వినియోగించాలనే విషయాన్ని ఆయా రాష్ట్రాల గవర్నర్లే నిర్ణయిస్తారని , వయోవృద్ధులకు, ఆరోగ్య కార్యకర్తలు మొదటివరుసలో ఉంటారని చెప్పారు. కఠినమైన పరీక్షల అనంతరం ఈ వ్యాక్సిన్‌కు అమోదం లభించిందని, 24 గంటల్లోపునే వాక్సినేషన్‌ ప్ర్రక్రియ మొదలవుతుందని ఆయన వెల్లడించారు.  అంతకు ముందు ఎఫ్‌డీఏకు బయట నుంచి సలహాలు ఇచ్చే నిపుణుల కమిటీ అనుకూలంగా నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు