అమెరికాలో కాల్పుల కలకలం.. మూడు చోట్ల పేలిన తుపాకీ.. ఆరుగురు మృతి..

18 Feb, 2023 09:28 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మిసిసిప్పీ రాష్ట్రంలో శుక్రవారం మూడు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మూడు చోట్ల కాల్పులకు పాల్పడింది ఒక్కడే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడ్ని ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు. అర్కబుట్ల, టాటె కౌంటీల్లోని ఓ స్టోర్, రెండు ఇళ్లలో కాల్పులు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడ్ని రిచర్ డేల్ క్రమ్(52)గా గుర్తించారు.

అయితే ఇతడు మొదట  తన మాజీ భార్య, ఇతర కుటుంబసభ్యులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తనకు కాబోయే భార్యను కాల్చి చంపినట్లు సమాచారం. అంతకుముందే ఓ స్టోర్‌లోనూ తుపాకీతో దాడి చేశాడు. ఈ ఘటనల్లో మొత్తం ఆరుగురు చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అతడు ఎందుకు ఈ  దాడులు చేశాడో ఇంకా తెలియదని పోలీసులు చెప్పారు. అతడ్ని విచారించాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

అర్కబుట్లలో నిందితుడు ఓ ఇంట్లోకి వెళ్లి కాల్పులు జరపడం పొరిగింటి మహిళ ప్రత్యక్షంగా చూసింది. అతి తక్కువ మంది నివసించే ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల తీవ్ర భయాందోళన వ్యక్తం చేసింది. నిందితుడు లోపలికి వెళ్లాక కాల్పుల శబ్దం వినిపించిందని, తాను బయటకు చూసే సరికి అతడు తుపాకీతో నడుచుకుంటూ వెళ్తున్నాడని వివరించింది. కాల్పులు జరిగిన ఇంట్లోకి వెళ్లి చూస్తే ఓ వ్యక్తి బుల్లెట్‌ గాయాలతో చనిపోయి ఉన్నట్లు వివరించింది.
చదవండి: 75 ఏళ్లు దాటితే యోగ్యతా పరీక్షలు పెట్టాలి: నిక్కీ హేలీ

మరిన్ని వార్తలు