భారత్‌ నాటోలో చేరనుందా? యూఎస్‌ నాటో రాయబారి షాకింగ్‌ వ్యాఖ్యలు

1 Apr, 2023 09:18 IST|Sakshi

భారత్‌తో సంబంధాల కోసం నార్త్‌ అట్లాంటిక్‌​ ట్రీటీ ఆర్గనైజేషన్‌(నాటో) తలుపులు తెరిచే ఉంచింది అని నాటోలోని యూఎస్‌ శాశ్వత ప్రతినిధి జూలియన్నే స్మిత్‌ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత్‌తో సాన్నిహిత్యంగా ఉండటం తమకు చాలా సంతోషంగా అనిపిస్తుందన్నారు. అంతేగాదు భారత్‌ కోరుకుంటే ఏ సమయంలోనైనా దీని గురించి చర్చిండానికి నాటో సిద్ధంగా ఉందని కూడా స్మిత్‌ చెప్పారు. దీంతో ఒకరకంగా నాటోలో భారత్‌ చేరేలా యూఎస్‌ ప్రత్యక్ష సంకేతాలిస్తునట్లుగా ఉంది. ఈ మేరకు భారత్‌, యూఎస్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు గురించి మాట్లాడుతూ..రెండు దేశాల మధ్య భాగస్వామ్యం అత్యంత దృఢంగా ఉన్నాయని చెప్పారు. ఇరు పక్షాలు ప్రజాస్వామ్యం, నియమాల ఆధారిత క్రమం, వాతావరణ మార్పు, హైబ్రిడ్‌ బెదిరింపులు, సైబర్‌ భద్రత, సాంకేతికత, విఘాతం కలిగించడం తదితర అంశాలపై కలిసి పనిచేయడంపై నిమగ్నమయ్యాయని అన్నారు.

సోవియట్‌ యూనియన్‌ కోసం ఏర్పడ్డ నాటో తొలిసారిగా ఇండో పసిఫిక్‌తో తన విస్తరణను పెంచుకుందని తెలిపారు. అలాగే చైనాను నాటో వ్యవస్థాగత సవాలుగా గుర్తించిందని చెప్పారు. అయితే ఆయా ప్రాంతాలలోని భాగస్వామ్యుల వ్యూహాత్మక విధానాల తోపాటు ముఖ్యంగా చైనా దూకుడు విధానానికి సంబంధించి వ్యూహాల గురించి తెలుసుకునేందుకు నాటో ఆసక్తి కనబరుస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నాలుగు ఇడో పసిఫిక్‌ దేశాలు జపాన్‌, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, లిథువేనియాలో జరగనున్న అత్యున్నత స్థాయి నాటో సమావేశానికి ఆహ్వానం అందినట్లు ఆమె తెలిపారు.  

ఈ దేశాలతో తమ భాగస్వామ్యం మరింతగా అభివృద్ధి చెందుతుంది. మొత్తం మీద నాటో ఏ ఇండో పసిఫిక్‌  దేశంతోనూ పొత్తుల పెట్టుకునే యోచన చేయడం లేదని, పైగా విస్తృత కూటమిగా విస్తరించే ఆలోచన కూడా లేదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు ఉక్రెయిన్‌ యుద్ధం గురించి మాట్లాడుతూ..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కేవలం ఒక్క రోజులో యుద్ధాన్ని ముగించగలరని అన్నారు. పశ్చిమ దేశాలు కేవలం ఉక్రెయిన్‌కు అవసరమైన వాటిని అందించడమే కాకుండా భవిష్యత్తులో రష్యన్లు చేసిన పనిని ఇతర దేశాలు చేసే ప్రమాదం ఉందని స్మిత్‌ హెచ్చరించారు. అలాగే ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కి భారత్‌ అందించిన మానవతా సాయాన్ని నాటో ప్రశంసించింది.

యుద్ధాన్ని ముగించాలని పిలుపునివ్వడమే గాక ఇతర దేశాల యూఎన్‌ నిబంధనలకు కట్టుబడి ఉందన్నారు. ఏదీఏమైనా ఈ ఉక్రెయిన్‌ యుద్ధం అన్ని దేశాలను ఏకతాటిపైకి తెచ్చిందని స్మిత్‌ అన్నారు. ఈ యుద్ధంలో రష్యా గనుక అణ్వాయుధాలను ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారు. దీని గురించి నాటో నిఘా ఉంచినట్లు కూడా యూఎస్‌ నాటో ప్రతినిధి స్మిత్ వెల్లడించారు. 

(చదవండి: పంజాబ్‌ సీఎం కూతురు సహా.. విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు ఖలీస్తానీ గ్రూపుల బెదిరింపులు)


 

మరిన్ని వార్తలు