పాకిస్తాన్‌ దుశ్చర్య.. మైనారిటీల హక్కులు పట్టవు

10 Dec, 2020 09:56 IST|Sakshi

సంచలన విషయాలు వెల్లడించిన అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ రాయబారి

ఇస్లామాబాద్‌: భారతదేశంలో మైనారిటీల హక్కుల గురించి మొసలి కన్నీరు కార్చే పాకిస్తాన్‌ తన దేశంలోని మైనారిటీలైన హిందూ, క్రైస్తవుల గురించి మాత్రం పెద్దగా పట్టించుకోదు. ఈ క్రమంలో అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ రాయబారి శామ్యూల్ బ్రౌన్‌బ్యాక్‌ సంచలన విషయాలు వెల్లడించారు. పాక్‌లోని హిందూ, క్రైస్తవ యువతులను చైనాకు బలవంతపు పెళ్లికూతుళ్లుగా.. ఉంపుడుగత్తెలుగా ఎగుమతి అవుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు జరగనున్న వెబినార్‌ చాలా క్లిషమైనది. చైనాకు పంపబడుతున్న బలవంతపు వధువులకు సంబంధించినది ఈ వెబినార్‌. పాకిస్తాన్‌ తన దేశంలోని మైనారిటీలైన క్రైస్తవులు, హిందూ యువతులను ఉంపుడుగత్తెలు, బలవంతపు వధువులుగా చైనాకు అమ్ముతుంది. ఎందుకంటే ఆ దేశంలో వీటిపై ఎవరు నోరు మెదపరు. మతపరమైన మైనారిటీలపై పాక్‌లో వివక్ష ఉంది. ఇది వారికి మరింత హానీ చేస్తుంది. అంతర్జాతీయ మత స్వేచ్ఛా చట్టం ప్రకారం పాకిస్తాన్‌ను ప్రత్యేక ఆందోళన ఉన్న దేశంగా (సీపీసీ) నియమించడానికి ఇది ఒక కారణమని’ ఆయన పేర్కొన్నారు. (పాక్‌ను ఆ లిస్టులోంచి తీసేయండి: టర్కీ)

దశాబ్దాలుగా చైనా విధించిన వన్-చైల్డ్ విధానం, అబ్బాయిలకు సాంస్కృతికంగా అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రస్తుతం డ్రాగన్‌ దేశంలో మహిళల కొరత ఉంది. దాంతో చైనా పురుషులు ఇతర దేశాల మహిళలను వధువు, ఉంపుడుగత్తెలు, కార్మికులుగా దిగుమతి చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి పాంపియో పాకిస్తాన్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు ఎందుకు అనే ప్రశ్నకు బ్రౌన్‌బ్యాక్ ప్రతిస్పందించారు. “పాకిస్తాన్‌లో మతపరమైన హింస చెలరేగినప్పుడు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. భారతదేశంలో చాలా మత ఘర్షణలు జరుగుతాయి. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు సమర్థవంతమైన పోలీసు, న్యాయపరమైన చర్యలు అమలు జరిగియా లేదా అనే విషయాన్ని గుర్తించడానికి మేము ప్రయత్నిస్తాము’’ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మతభ్రష్టుడు, దైవదూషణ కారణంగా బంధించబడి జైళ్లో ఉన్న జనాభాలో సగం మంది పాకిస్తాన్‌ జైళ్లలోనే మగ్గుతున్నారని బ్రౌన్‌బ్యాక్‌ వెల్లడించారు. (చదవండి: కామాంధులపై పాక్‌ సర్కారు ఉక్కుపాదం!)

అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో సోమవారం "మత స్వేచ్ఛ పరంగా క్రమబద్ధమైన, కొనసాగుతున్న, అతిగా ఉల్లంఘనలకు" పాల్పడటం వంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న చైనా, పాక్‌తో సహా 8 దేశాలను సందర్శించారు. యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం (యూఎస్‌సీఐఆర్ఎఫ్) భారతదేశాన్ని కూడా ప్రత్యేక ఆందోళన కలిగిన దేశంగా (సీపీసీ) నియమించాలని విదేశాంగ శాఖకు సిఫారసు చేసింది. కానీ స్టేట్ డిపార్ట్మెంట్ ఈ సిఫారసును అంగీకరించలేదు. యూఎస్‌సీఐఆర్‌ఎఫ్ దేశానికి వ్యతిరేకంగా చేసిన పరిశీలనలను భారతదేశం తన వార్షిక నివేదికలో తిరస్కరించింది. పాంపియో పాకిస్తాన్‌తో పాటు, చైనా, మయన్మార్ ఎరిట్రియా, ఇరాన్, నైజీరియా, ఉత్తర కొరియా, సౌదీ అరేబియా, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్‌లను కంట్రీ ఆఫ్‌ పర్టిక్యూలర్‌ కన్‌సర్న్‌(సీపీసీ)జాబితాలో చేర్చారు.

మరిన్ని వార్తలు