అధ్యక్ష ఎన్నికలపై పోస్టల్‌ సర్వీస్‌ వార్నింగ్‌

15 Aug, 2020 17:21 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా విపత్కర పరిస్థితుల్లో పోస్ట‌ల్ ఓటింగ్ విధానానికి అమెరికాలో ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో పోస్టల్‌ ఓటింగ్‌ను మ‌రింత స‌ర‌ళం చేయాల‌ని అమెరికాలోని రాష్ట్రాలు భావిస్తున్నాయి. అయితే, అమెరికా పోస్టు మాస్టర్‌ జనరల్‌ లూయిస్‌ డిజోయ్ నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. విపరీతంగా పెరిగే పోస్టల్‌ ఓట్లతో సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.  దాంతోపాటు సుదూరంలో ఉండే 46 సముద్ర తీర రాష్ట్రాల్లోని ప్రాంతాల నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులు సకాలంలో అందుతాయని హామీ ఇవ్వలేమని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల గడువులకు లోబడి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నప్పటికీ మిలియన్ల కొద్దీ ఓట్లు నిరాకరణకు గురయ్యే అవకాశముందని హెచ్చరించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసినట్టు తెలిపారు. (ఇజ్రాయెల్, యూఏఈ శాంతి ఒప్పందం)

ఓటర్లను నొప్పించడం తన ఉద్దేశం కాదని అన్నారు. అయితే, వాస్తవ పరిస్థితులను చూసుకుని వ్యవహరించాలని ఆయన చెప్తున్నారు. మరోవైపు ప్ర‌జ‌లంద‌రూ సుశిక్షితంగా, సురక్షితంగా మునుప‌టిలా ఓటు వేసే స‌మ‌యం వ‌చ్చేవ‌ర‌కూ ఎన్నికల‌ను వాయిదా వేయాల‌ని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త వాదన తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. పోస్టల్‌ ఓటింగ్‌ ద్వారా అవకతవకలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.  అయితే, ట్రంప్ చెబుతున్న లోపాల‌కు సంబంధించి ఎలాంటి గ‌ట్టి ఆధారాలు లేవు. పైగా ఆయన పోస్ట‌ల్ ఓటింగ్‌ను విమ‌ర్శించడం ఇదే తొలిసారి కాదు. ఇదిలాఉండగా.. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో రోడ్డుకు సమీపంలో ఉండే పోస్టు బాక్సులను తొలగించారని కొందరు ఓటర్లు, ప్రజాప్రతినిధులు ఇప్పటికే విమర్శలు చేశారు. ట్రంప్‌న‌కు అనుకూలుడైన పోస్ట్‌ మాస్టర్ జనరల్‌‌ ఎపుడూ లేని సమస్యలు లేవనెత్తుతున్నారని కొందరు విమర్శిస్తున్నారు. (చదవండి: టిక్‌టాక్‌ బ్యాన్ : ట్రంప్ ఊరట)

మరిన్ని వార్తలు