మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం

26 Sep, 2021 16:57 IST|Sakshi

అమెరికా మద్దతుగా నిలుస్తుందన్న అధ్యక్షుడు జో బైడెన్‌

వాషింగ్టన్‌: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (యూఎన్‌ఎస్‌సీ) భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ఈ అంశంలో భారత్‌కు అమెరికా మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పారు. అత్యద్భుతమైన నాయకత్వ పటిమను ప్రదర్శిస్తూ, ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తున్న భారత్‌ను న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూపులో (ఎన్‌ఎస్‌జీ)లో చేర్చాలని అన్నారు. వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరు నేతలు ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మండలిలో సంస్కరణలు అమలు చేసినప్పుడు భారత్‌ శాశ్వత సభ్యత్వానికి తాము మద్దతునిస్తామని బైడెన్‌ స్పష్టం చేశారు.  

అఫ్గాన్‌ ఉగ్రవాదుల్ని పెంచి పోషించకూడదు
అఫ్గానిస్తాన్‌లో మానవ హక్కులు, మహిళలు, పిల్లలు, మైనార్టీల హక్కుల్ని గౌరవిస్తూ ఇచి్చన మాటలకి తాలిబన్లు కట్టుబడి ఉండాలని అమెరికా, భారత్‌ హితవు చెప్పాయి. అఫ్గాన్‌ భూభాగం ఉగ్రవాదులకు నిలయంగా మారకూడదని, మరే దేశంలోనూ ఉగ్ర సంస్థలు విలయం సృష్టించకూడదని బైడెన్, మోదీ సంయుక్త ప్రకటన హెచ్చరించింది. అఫ్గాన్‌పై యూఎన్‌ భద్రతా మండలి తీర్మానం 2593 ప్రకారం తాలిబన్లు అఫ్గాన్‌ గడ్డను ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడానికి, శిక్షణ ఇవ్వడానికి, ఆరి్థక సహకారం అందజేయడానికి వాడకూడదని వారు చెప్పారు. అఫ్గాన్‌ వీడి వెళ్లాలనుకునే విదేశీయులను, అఫ్గాన్లను సురక్షితంగా పంపడానికి చర్యలు తీసుకోవాలని బైడెన్, మోదీ కోరారు.

26/11 కుట్రదారుల్ని శిక్షించాలి
ఉగ్రవాదంపై సంయుక్త పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనీ, ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత్, అమెరికా తెలిపాయి. సీమాంతర ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించబోమని చెప్పిన నేతలు ముంబై 26/11 దాడుల సూత్రధారుల్ని కఠినంగా శిక్షించాలన్నారు. దాడుల వెనుక పాక్‌కు చెందిన లష్కరే తోయిబా, జమాత్‌ ఉద్‌ దవా హస్తం ఉందన్న విషయం తెలిసిందే. ఐరాస గుర్తించిన జాబితాలో జైషే మహమ్మద్, అల్‌ ఖాయిదా, హక్కానీ నెట్‌వర్క్‌ కూడా ఉన్నాయి.

మరిన్ని వార్తలు