చైనా నిర్వాకం: ప్రపంచం నెత్తిన మరో ప్రమాదం...

5 May, 2021 16:44 IST|Sakshi

నియంత్రణ కోల్పోయి భూమి వైసు దూసుకువస్తోన్న రాకెట్‌

రంగంలోకి దిగిన అమెరికా స్పేస్‌ కమాండ్‌

వాషింగ్టన్‌: కోవిడ్‌ ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. మహమ్మారి వ్యాప్తి మొదలై ఇప్పటికే దాదాపు ఏడాదిన్నర కావోస్తుంది. దీన్నుంచి ఇంకా కోలుకోకమునుపే చైనా ప్రపంచం నెత్తిన మరో బాంబు వేసింది. డ్రాగన్‌ దేశం పంపిన ఓ రాకెట్‌ నియంత్రణ కోల్పోయి భూమి దిశగా పయనిస్తుందట. ఏ క్షణమైన అది భూమ్మీద పడవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏ రాకెట్‌ కూలిపోయిన సముద్రంలో పడుతుంది. కానీ చైనా ప్రయోగించిన లాంగ్‌ మార్చ్‌ 5బీ రాకెట్‌ మాత్ర భూమి దిశగా దూసుకువస్తుందట. అది ఎక్కడ పడనుందో తెలియక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా రక్షణశాఖ ప్రస్తుతం 5బీ రాకెట్‌ను ట్రాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ నెల 8న అది భూమ్మీదకు వచ్చే అవకాశం ఉందంటున్నారు పెంటగాన్‌ శాస్త్రవేత్తలు. కాకపోతే అది సరిగ్గా ఏ ప్రదేశంలో భూవాతవరణంలో ప్రవేశిస్తుందో అంచనా వేయలేకపోతున్నారు. ఈ రాకెట్‌ మార్గాన్ని అమెరికా స్పేస్‌ కమాండ్‌ నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు. ఇక లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్‌ బరువు సుమారు 21 టన్నులు. ఇది ఏ క్షణానైనా భూమిపై పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. 

గత వారం అంతరిక్షంలో సొంత స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు డ్రాగన్ కంట్రీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మొదటి మాడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో స్పేస్‌ స్టేషన్‌ నిర్మించడం కోసం చైనా లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌ తియాన్హే స్పేస్‌ మ్యాడుల్‌ను అంతరిక్షంలోని 300 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలోకి చేర్చింది. నియంత్రణ కోల్పోయిన ఈ రాకెట్‌ శకలాలు భూమి మీదకు దూసుకురానున్నాయి.  

చైనా 2022 నాటి కల్లా అంతరిక్షంలో సొంతంగా ఓ స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో సుమారు ముగ్గురు వ్యోమగాములు ఉండేలా చైనా ప్లాన్‌ చేస్తోంది. తియాన్ గాంగ్ స్పేస్‌ స్టేషన్‌లో భాగంగా 30 మీటర్ల పొడవైన తొలి మ్యాడుల్‌ ‘టియాన్హె’ను చైనా లాంగ్‌ మార్చ్ రాకెటును ఉపయోగించి అంతరిక్షంలోనికి పంపింది.

చదవండి: అంతరిక్షంపై డ్రాగన్‌ నజర్‌...!

మరిన్ని వార్తలు