19 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ: ‘బతికుండగా బయటకు వస్తాననుకోలేదు’

21 Jul, 2021 11:04 IST|Sakshi
గ్వాంటినామో బే నిర్బంధ కేంద్ర (ఫైల్‌ ఫోటో: వియాన్‌ న్యూస్‌.కామ్‌)

జైలు జనాభాను తగ్గించేదిశగా బైడెన్‌ అడుగులు

19 ఏళ్లుగా విచారణ లేకుండా జైల్లో ఉన్న వ్యక్తి విడుదలతో ప్రారంభం

వాషింగ్టన్‌: 19 సంవత్సరాల నుంచి ఎటువంటి నేరారోపణలు లేకుండా గ్వాంటినామో బేలోని నిర్బంధ కేంద్రంలో ఉన్న మోరాకో వ్యక్తిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ యంత్రాంగం సోమవారం విడుదల చేసింది. బైడెన్‌ యంత్రాంగం విడుదల చేసిన ఈ మొదటి వ్యక్తి పేరు అబ్దుల్‌ లతీఫ్‌ నాజీర్‌(56). ఎలాంటి నేరం చేయకపోయినప్పటికి అబ్దుల్‌ గత 19 ఏళ్లుగా జైల్లోనే మగ్గుతున్నాడు. చనిపోయేంత వరకు విముక్తి లభించదని భావించిన లతీఫ్‌.. జైలు నుంచి విడుదల కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాడు. బైడెన్‌ యంత్రాగానికి కృతజ్ఞతలు తెలియజేశాడు. 

అబ్దుల్‌ లతీఫ్‌ విడుదల సందర్భంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఓ ప్రకటన చేసింది. ‘‘2016లో ది పిరియాడిక్‌ రివ్యూ బోర్డ్‌ ప్ర​క్రియ ప్రకారం యుద్ధ నిర్బంధ చట్టం కింద అరెస్ట్‌ అయిన అబ్దుల్‌ లతీఫ్‌ నాసిర్‌ వల్ల అమెరికా జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని తేల్చడం జరిగింది. కనుక అతడిని ఇంకా నిర్బంధంలో ఉంచాల్సిన అవసరం లేదని ప్రభుత్వ నిర్ణయించింది’’ అని తెలిపింది.

జైలు జనాభాను తగ్గించేందకు అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా సత్ప్రవర్తిన కలిగిన వారిని, ఎలాంటి నేరారోపణ లేకుండా జైలులో ఉన్న వారిని విడుదల చేసి.. తమ స్వస్థాలాలకు పంపి.. వారిపై నిఘా ఉంచాలని తెలిపారు. అబ్దుల్‌ లతీఫ్‌ విడుదల బైడెన్‌ ప్రయత్నానికి మొదటి సంకేతంగా నిలిచింది.

అబ్దుల్‌ లతీఫ్‌ నాజర్‌ 19 ఏళ్ల క్రితం అఫ్గనిస్తాన్‌లో అమెరికా సైన్యానకి పట్టుబడ్డాడు. అధికారులు ఇతడిని తాలిబన్‌ సభ్యుడని.. అల్‌ ఖైదాలో శిక్షణ పొందాడని ఆరోపిస్తూ.. అరెస్ట్‌ చేసి.. జైలులో ఉంచారు. అయితే నాజీర్‌ను ఐదేళ్ల క్రితమే గ్వాంటనామో బే నుంచి విడుదల చేసేందుకు ఆమోదం లభించింది. జూలై 2016లోనే సమీక్ష బోర్డు అబ్దుల్‌ని స్వదేశానికి పంపాలని సిఫార్సు చేసింది. కానీ అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో అబ్దుల్‌ గ్వాంటనామోలోనే ఉండి పోవాల్సి వచ్చింది. బైడెన్‌ నిర్ణయం వల్ల అబ్దుల్‌కు 19 సంవత్సరాల తర్వాత విముక్తి లభించింది. 
 

మరిన్ని వార్తలు