ఏకపక్ష ఆంక్షల ఉల్లంఘన .. భారత్‌ కంపెనీపై అమెరికా ఆంక్షలు

1 Oct, 2022 19:09 IST|Sakshi

ఢిల్లీ: భారత్‌కు చెందిన ఓ కంపెనీపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. ఆంక్షలను లెక్క చేయకుండా ఇరాన్‌ నుంచి పెట్రోలియం ప్రొడక్టులు కొనుగోలు చేయడమే అందుకు కారణం. అంతేకాదు.. సదరు కంపెనీ ఆ ఉత్పత్తులను చైనాకు  రవాణా చేస్తున్నట్లు అగ్రరాజ్యం ఆరోపించింది. 

ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ ఆఫీస్‌ అడ్రస్‌తో ఉన్న టిబాలాజీ పెట్రోకెమ్‌ కంపెనీపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ కంపెనీతో పాటు యూఏఈ, హాంగ్ కాంగ్‌కు చెందిన మొత్తం ఏడు కంపెనీలు సైతం అమెరికా ఆంక్షలను ఎదుర్కొనున్నాయి. ఈ మేరకు ఓఎఫ్‌ఏసీ(Office of Foreign Assets Control) ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇరాన్‌తో న్యూక్లియర్‌ డీల్‌ చెదిరిన తర్వాత 2018-19 నడుమ ట్రంప్‌ హయాంలోని ప్రభుత్వం ఏకపక్ష ఆంక్షలను తెర మీదకు తెచ్చింది. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వం 2019 నుంచి ఇరాన్‌తో ఆయిల్‌ ఉత్పత్తుల దిగుమతి ఒప్పందాల్ని నిలిపివేసింది. అయితే.. 

ఉక్రెయిన్‌ సంక్షోభం తర్వాత రష్యా నుంచి భారత్‌ క్రూడ్‌ ఆయిల్‌ కొనుగోలు చేయడం పెరిగింది. ఇక తాజా ఆంక్షల విధింపు పరిణామం.. విదేశాంగ మంత్రి జైశంకర్‌ అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే చోటు చేసుకోవడం గమనార్హం. టిబాలాజీ కంపెనీ మిలియన్ల డాలర్ల విలువైన పెట్రోకెమికల్‌ ఉత్పత్తులను ఇరాన్‌ కంపెనీ ట్రిలయన్స్‌ నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 

 

మరిన్ని వార్తలు