మరోముప్పు.. కరోనా హైబ్రిడ్‌

29 May, 2021 14:32 IST|Sakshi

వియత్నాంలో కరోనా హైబ్రిడ్‌ గుర్తింపు

పాత వేరియంట్లను మించిన వేగంతో ‘హైబ్రిడ్‌’వ్యాప్తి

గాలి ద్వారా సోకుతుందంటున్న శాస్త్రవేత్తలు

వియత్నాంలో వేగంగా విస్తరిస్తున్న హైబ్రిడ్‌ కరోనా

వెబ్‌డెస్క్‌: కరోనా ముప్పు ప్రపంచాన్ని ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. ఇప్పటికే కరోనా వేరియంట్స్‌తో అన్ని దేశాలు ఇబ్బందులు పడుతుంటే..... కొత్తగా కరోనా హైబ్రిడ్‌ రకం  వెలుగు చూసింది. గత వేరియంట్‌లను మించి ప్రమాదకరంగా ఈ హైబ్రిడ్‌ రకం విస్తరిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

వియత్నాంలో సంకర కరోనా
సాధారణంగా వైరస్‌లు ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూనే ఉంటాయి. మొదట వచ్చిన వైరస్‌లతో పోల్చితే హాని చేయడంలో మార్పు చెందిన వైరస్‌ వేరియంట్లు చాలా ప్రమాదకరం. అయితే తాజాగా ఇలా రూపు మార్చుకున్న రెండు ప్రమాదకర వేరియంట్ల నుంచి అ‍త్యంత ప్రమాదకరమైన సంకర జాతి కరోనా వైరస్‌ పుట్టుకొచ్చింది. వియత్నాంలో  సంకర కరోనా మ్యూటెంట్‌ ( హైబ్రిడ్‌ మ్యూటెంట్‌)ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఇండియాలో, బ్రిటన్‌లలో విపత్తును సృష్టించిన కరోనా మ్యూటెంట్ల లక్షణాలతో ఈ కొత్త హైబ్రిడ్‌  వేరియంట్‌  పుట్టుకొచ్చినట్టు వియత్నాం హెల్త్‌ మినిష్టర్‌ న్యూయెన్‌ థాన్‌ ప్రకటించారు.

పాత వేరియంట్‌లను మించి
వియత్నాం దేశాన్ని ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ చుట్టేస్తోంది. దేశంలో ఉన్న 63 నగరాల్లో 31 నగరాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు ఈ 31 నగరాల నుంచే వస్తున్నాయి. దీంతో ఇక్కడ కరోనా బారిన పడ్డ రోగుల నుంచి తీసుకున్న శాంపిల్స్‌ పరిశీలించగా.... ఇండియా, బ్రిటన్‌లలో వెలుగు చూసిన కరోనా వేరియంట్‌ లక్షణాలతో కొత్త హైబ్రిడ్‌ వేరియంట్‌  పుట్టుకొచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్‌ పూర్వపు మ్యూటెంట్లను మించిన  వేగంతో త్వరగా వ్యాపిస్తోందని, గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరి సోకే లక్షణం ఈ హైబ్రిడ్‌కు రకానికి ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియా, బ్రిటన్‌లలో వెలుగు చూసిన వేరియంట్ల కంటే ఇది ప్రాణాలకు ఎక్కువ ముప్పు తెస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం  చేస్తున్నారు. ఈ హైబ్రిడ్‌వేరియంట్‌కి సంబంధించిన సమాచారం త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేస్తామని వియత్నాం అంటోంది.

వియత్నాంలో వణుకు
ఇప్పటికే వియత్నాంలో ఏడు రకాల వేరియంట్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కరోనా వేరియంట్ల వ్యాప్తిని గతంలో అక్కడి ప్రభుత్వం కట్టడి చేసింది. కానీ హైబ్రిడ్‌ రకం మ్యూటెంట్‌కు అడ్డకట్ట వేయడం కష్టంగా మారింది. ఇప్పటికే ఆ దేశంలో 6,396 మంది కరోనా బారిన పడగా 47 మంది మరణించారు. దేశంలో రోజురోజుకి  హైబ్రిడ్‌ రకం ప్రమాదకరంగా విస్తరిస్తుండటంతో వియత్నాం ప్రజల వెన్నులో వణుకు పుడుతోంది.
 

మరిన్ని వార్తలు