వైరల్‌: అంతా మ్యాచ్‌లో లీనం.. ఒక్కసారిగా స్టేడియంలో..

13 Sep, 2021 21:06 IST|Sakshi

ఇటీవల పలు చోట్ల జంతువులను కాపాడిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారడమే గాక నెటిజన్ల మనసును కూడా దోచుకుంటున్నాయి. అలాంటి ఘటనలోనే ఓ పిల్లిని కాపాడినందుకు కొందరు పెద్ద మొత్తంలో రివార్డును కూడా అందుకున్న సంగతి తెలిసిందే. స్టేడియంలో ఆటగాళ్లు తమ ఆటతో హైలెట్‌గా నిలవడం మామూలే కానీ అక్కడ ఓ పిల్లి టాక్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లా మారింది. ఎలా అంటారా!

వివరాల్లోకి వెళితే.. మయామి హరికేన్స్ యూనివర్శిటీ, అప్పలాచియన్ స్టేట్ మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు శనివారం హార్డ్ రాక్ స్టేడియంలో ఓ నాటకీయ సంఘటన చోటుచేసుకుంది. ప్రేక్షకులంతా మ్యాచ్‌ని వీక్షిస్తున్నారు. అంతలో స్టేడియం ఎగువ డెక్ నుంచి ఓ పిల్లి వేలాడుతున్నట్లు వారికి కనిపించింది. ఇక అంతవరకు ఉత్సాహంగా మ్యాచ్‌ని ఎంజాయ్‌ చేస్తున్న ఆడియన్స్‌ దృష్టి ఒక్కసారిగా పిల్లి వైపు మారింది. అంతలో మ్యాచ్‌ని చూడటానికి వచ్చిన క్రెయిగ్ క్రోమర్, అతని భార్య కింబర్లీ సరైన సమయంలో స్పందించారు.

ఆ జంట పిల్లి తన పట్టును కోల్పోతుందని గ్రహించి, సరిగ్గా అది కింద పడే ప్రాంతలో వారి వెంట తెచ్చుకున్న జెండాను పట్టుకున్నారు. దాన్ని కాపాడటానికి అక్కడ జంటతో పాటు కొందరు ఓ రెస్క్యూ టీమ్‌లా ఏర‍్పడి పిల్లిని కింద పడకుండా పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇక ఒకే పంజాతో గోడ అంచున పట్టుకున్న ఆ పిల్లి తన పట్టును తిరిగి పొందడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. అయితే, కొంత సేపటి అనంతరం అది ఎగువ డెక్ నుంచి పడిపోయింది. అదృష్టవశాత్తూ, ఆ పిల్లికి ఎటువంటి గాయాలు కాకుండా వారు పట్టుకోగలిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో దూసుకుపోతోంది. పిల్లిని కాపాడిన వారిని నెటిజన్లు అభినందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? చిన్నారి బిస్కెట్‌ దొంగతనం వైరల్‌

మరిన్ని వార్తలు