బాబోయ్‌.. వాళిద్దరు నీళ్లు తాగకుండా ఐదు రోజులు.. అది కూడా..

18 Oct, 2021 19:44 IST|Sakshi

సిడ్నీ: మ‌నిషి ఆహారం లేకపోయినా కొన్ని రోజులు బ‌తకగలడు కానీ మంచినీళ్లు లేకుంటే మాత్రం బతకడం కష్టం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు యువకులు మంచినీళ్లు తాగకుండా ఏకంగా ఐదు రోజులు బ‌తికారంటే నమ్ముతారా. అయినా వారిద్దరు అలా ఉండడం వెనుక ఓ కథ ఉంది. వివ‌రాల్లోకి వెళ్తే.. హెర్మాన్స్‌బ‌ర్గ్ అనే మారుమూల ప్రాంతానికి చెందిన షాన్ ఎమిట్జా (21), మ‌హేశ్ పాట్రిక్ (14) అనే ఇద్దరు యువకులు గ‌త మంగ‌ళ‌వారం సెంట్రల్ ఆస్ట్రేలియాలోని హార్ట్స్ రేంజ్ ప్రాంతానికి విహారయాత్ర‌కు వెళ్లారు. ట్రిప్‌ పూర్తి చేసుకుని తిరిగు ప్రయాణంలో వారు దారి త‌ప్పిపోయారు.

అదీ కూడా చెత్తాచెదారంతో నిండిన, వాతావరణం కూడా 40 డిగ్రీల పైనే ఉండడంతో పాటు కనీసం తాగునీరు కూడా దొర‌క‌ని ప్రాంతంలో చిక్కుకుపోయారు. వారు తప్పిపోయిన విషయం తెలుసుకున్న పోలీసులు హెలిక్యాప్టర్‌ సాయంతో వారి కోసం బయలుదేరారు. అలా వెళ్లిన పోలీసులకు ఐదు రోజులు తరువాత వారు దొరికారు. మ‌హేశ్ ప్యాట్రిక్‌ను శుక్రవారం సాయంత్రం బుష్‌లాండ్ ప్రాంతంలో గుర్తించగా, శ‌నివారం మ‌రో ప్రాంతంలో షాన్ ఎమిట్జా ఆచూకీని పోలీసులు క‌నిపెట్టారు. అయితే అప్పటికే వారిద్దరు డీహైడ్రేష‌న్‌కు గురై ఉండడంతో వారిని హుటాహుటిన ఆస్పత్రిలో తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ ఇద్దరికి ప్రాణాపాయం త‌ప్పిందని వైద్యులు సూచించారు.

చదవండి: Snake Hanging On Overhead Cables: వామ్మో...ఓవర్‌ హెడ్‌ వైర్ల పై పెద్ద పాము

మరిన్ని వార్తలు