Afghanisthan: ఏమీ వద్దు.. ప్రాణాలు మిగిలితే చాలు..

17 Aug, 2021 15:48 IST|Sakshi

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌లో ప్రస్తుతం తాలిబన్ల రాకతో భీతిల్లుతున్న అక్కడి ప్రజలు.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని దేశం విడిచి పారిపోతున్నారు. కాబూల్‌ విమానాశ్రయం నుంచి వచ్చిన ఓ అమెరికా విమానంలోని దృశ్యం.. అఫ్గన్ ప్రజల దుస్థితికి అద్దం పడుతోంది. అందులో.. ప్యాసింజర్ రైలులా ఏకంగా 640 మంది ఒకే విమానంలో ప్రయాణించారు. గతంలో తాలిబన్ల అరాచక పాలన చవి చూసిన ప్రజలు మళ్లీ ఆ చీకటి రోజులు రాబోతున్నాయని భయపడుతున్నారు.

దీంతో ఒక్కసారిగా అఫ్గన్‌ వాసులు సోమవారం దేశం విడిచి వెళ్లేందుకు కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తారు. దీంతో ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో కాస్త ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. బస్సుల్లో సీట్ల కోసం అన్నట్టుగా అఫ్గన్లు విమానాల్లో చోటు కోసం రన్‌వేపై పరుగులు తీశారు. విమాన0 లోపలికి ఎక్కేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే యూఎస్ కు చెందిన ఓ విమానంలో దాదాపు 640 మంది ప్రజలు ఎక్కేసారు. అలా ఆ విమానంలో అంత మంది ప్రయాణించడం ఇదే మొదటి సారి కూడా. వారి వద్ద ఎలాంటి వస్తువులు, లగేజీ కన్పించలేదు. తాలిబన్ల నుంచి తప్పించుకునే క్రమంలో తమ ప్రాణాలు మాత్రం చాలని అన్నీ వదులుకుని ఇతర దేశాలకు పారిపోతున్నారు.

దీంతో ఈ విమానం రైల్లో జనరల్‌ బోగీని తలపించింది. ఈ ఫొటోలను అమెరికా అధికారిక మీడియా సంస్థ ‘డిఫెన్స్‌ వన్‌’ తమ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు