Russia Ukraine War: టాప్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్న పుతిన్‌.. ఆదుకోవాలని జెలెన్‌ స్కీ ఆవేదన..

14 Mar, 2022 11:30 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు బాంబుల మోత మోగిస్తున్నాయి. ఇప్పటి వరకు కీవ్‌ను టార్గెట్‌ చేసిన దాడుల చేసిన బలగాలు.. తాజాగా ఉక్రెయిన్‌ పశ్చిమ ప్రాంతాలపై విరుచుకుపడుతున్నాయి. వైమానిక దాడులతో రష్యా బలగాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాగా, దాడుల నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా దాడులను ఆపేందుకు తమ దేశ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని నాటో దేశాలను మళ్లీ కోరారు.

ఉ‍క్రెయిన్‌పై 19వ రోజుకు చేరుకున్న రష్యా దాడుల్లో రాకెట్లు నాటో భూభాగంపైనా పడతాయని జెలెన్‌ స్కీ హెచ‍్చరించారు. పుతిన్‌ ఆపకపోతే.. పశ్చిమ దేశాలతో యుద్దానికి దిగుతారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, యూరోపియన్‌ యూనియన్‌లో ఉక్రెయిన్‌ సభ్యత్వంపై కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైకెల్‌తో తాను మాట‍్లాడినట్టు జెలెన్‌ స్కీ తెలిపారు. ఈ క్రమంలో ఈయూలో ఉక్రెయిన్‌కు సభ్యత్వానికి ప్రాధాన్యమిస్తామని వెల్లడించారని అన్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం, రష్యాపై మరిన్ని ఆంక్షలు వంటి అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు.

పుతిన్‌ వార్నింగ్‌..
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో పుతిన్‌ గేరు మార్చారు. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మారుస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌కు ఆయుధాల పరంగా సాయం చేసే దేశాలను తాము టార్గెట్‌ చేస్తామని పుతిన్‌ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే రష్యా బలగాలు.. ఉక్రెయిన్‌ పశ్చిమ ప్రాంతాలకు విస్తరించి.. పోలాండ్‌ సరిహద్దుల్లో బాంబు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 35 మంది మృత్యువాతపడగా.. మరో 134 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉండగా సోమవారం మరోసారి ఉక్రెయిన్‌, రష్యా మధ్య శాంతి చర్చలు జరుగనున్నాయి.

మరిన్ని వార్తలు