లక్షల మందిని రక్షించిన సింగిల్ రిపోర్ట్!

9 May, 2021 14:54 IST|Sakshi

రెండో ప్రపంచ యుద్ధంలో మృత్యు కుహరాలుగా నిలిచిన నాజీ క్యాంపులు చరిత్రలో మాయని మచ్చను మిగిల్చిన సంగతి తెలిసిందే. శత్రుదేశాల ప్రజలు, సైనికులు, ముఖ్యంగా యూదులను విషవాయువులు నింపిన గ్యాస్‌ చాంబర్లలోకి తరలించి అత్యంత క్రూరంగా చంపేసే కేంద్రాలే నాజీ శిబిరాలు. అలాంటి ఓ క్యాంపులో నుంచి బయటపడడమే కాక, అక్కడి దారుణాలను ప్రపంచానికి వెల్లడించి లక్షలాది మంది ప్రాణాలను కాపాడి చరిత్రకెక్కారు.. ఆల్ఫ్రెడ్‌ వెజ్లర్, రుడాల్ఫ్‌ వెబా. వీరిద్దరూ స్లొవేకియాకు చెందిన యూదులు. 

ఒకరికొకరికి పరిచయం లేదు. యుద్ధ సమయంలో జర్మనీ సైనికులకు చిక్కారు. వీరిని అప్పటి జర్మనీ ఆక్రమిత పోలాండ్‌లోని ఆస్చ్‌విజ్‌ డెత్‌ క్యాంపులోకి తరలించారు. అక్కడ కలసిన వీరు, జర్మన్‌ సైనికుల చేతుల్లో చిత్రహింసలు అనుభవించారు. ఓ రోజు తప్పించుకొని, శిబిరానికి బయట కొద్ది దూరంలో ఉన్న ఓ కట్టెల కుప్ప మధ్యలో దాక్కున్నారు. ఇలా గంటా రెండు గంటలు కాదు ఏకంగా నాలుగు రోజులపాటు నాజీ సైనికుల కంటపడకుండా అక్కడే ఉన్నారు. 

ఆ తర్వాత అక్కడి నుంచి బయటపడి, వందలాది మైళ్లు నడిచి స్లొవేకియాకు చేరుకున్నారు. నాజీ క్యాంపుల్లోని దారుణాలపై ఒక నివేదిక తయారుచేశారు. ఇది వెబా-వెజ్లర్‌ రిపోర్ట్‌గా పేరు పొందింది. ఈ నివేదికను స్విట్జర్లాండ్‌ వేదికగా మీడియాకు విడుదల చేయడంతో నాజీల అకృత్యాలు ప్రపంచానికి తెలిశాయి. ఫలితంగా గ్యాస్‌ చాంబర్లలో యూదుల ఊచకోతకు అడ్డుకట్ట పడింది. ఆ విధంగా వెజ్లర్‌-వెబా(ఆస్చ్‌విజ్‌) రిపోర్ట్‌ లక్షల మంది ప్రాణాలు నిలిపింది.

చదవండి:

నాలుగు వారాల పాటు ఆ నగరమంతా మత్తులోనే..

మరిన్ని వార్తలు