ఐదు లోహాలు కలసి.. విషాన్ని ఇంధనం చేశాయి!

3 Jul, 2021 08:27 IST|Sakshi

వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ పెరుగుతోందని తరచూ వింటుంటాం. ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతీ మనకు తెలుసు. తాజాగా వాషింగ్టన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఐదు లోహాలతో తయారైన మిశ్రధాతువును ఉ్రత్పేరకంగా వాడటం ద్వారా కార్బన్‌డయాక్సైడ్‌ను కార్బన్‌ మోనాక్సైడ్‌గా మార్చొచ్చని నిరూపించారు. ఈ కార్బన్‌ మోనాక్సైడ్‌ను పెట్రోలు, డీజిల్‌ మాదిరిగా నేరుగా ఇంధనంగా వాడుకోవచ్చు. లేదంటే కొన్ని రసాయన చర్యల ద్వారా అన్నింటికంటే మెరుగైన ఇంధనంగా చెప్పే హైడ్రోజన్‌ను తయారు చేయొచ్చు.

ఐదు లోహాలను కలపడం ద్వారా తయారైన సరికొత్త మిశ్రధాతువును ట్రాన్సిషన్‌ డై చాలకనాడులు అని పిలుస్తారు. అత్యంత పలుచగా ఉండే ఈ రకమైన మిశ్రధాతువులను ఎల్రక్టానిక్స్‌లో, ఆప్టికల్‌ పరికరాల్లో వాడుకోవచ్చని ఇప్పటికే తెలుసు. ఈ నేపథ్యంలో వాషింగ్టన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ మిశ్రధాతువును రసాయన చర్యలకు ఉత్ప్రేరకంగా వాడొచ్చా అన్న అనుమానంతో పరిశోధనలు ప్రారంభించారు.

కంప్యూటర్‌ మోడళ్ల సాయంతో ఈ ధాతువు తయారీకి అవసరమైన లోహ మిశ్రమాన్ని గుర్తించారు. మాలిబ్డినం, టంగ్‌స్టన్, వనాడియం, నియోబియం, టాన్‌టలం అనే ఐదు లోహాలను నిర్దిష్ట మోతాదుల్లో కలపడం ద్వారా కొత్త మిశ్రధాతువును తయారు చేయొచ్చని గుర్తించారు. ఈ మిశ్రధాతువును ఉపయోగించినప్పుడు కార్బన్‌ డయాక్సైడ్‌ చాలా వేగంగా కార్బన్‌ మోనాక్సైడ్‌గా మారడాన్ని గుర్తించారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, ఇతర పరిశ్రమల నుంచి వెలువడే కార్బన్‌ డయాక్సైడ్‌ను కార్బన్‌ మోనాక్సైడ్‌గా మార్చుకుని ఇంధనంగా వాడుకోవచ్చు. 

మరిన్ని వార్తలు