రూ.4 లక్షల విస్కీ బాటిల్‌ ఏమైనట్లు?

8 Aug, 2021 03:47 IST|Sakshi

వాషింగ్టన్‌: అగ్రరాజ్యమైన అమెరికాను ప్రసన్నం చేసుకుని తమ సొంత పనులు, సొంత దేశ పనులు విజయవంతంగా పూర్తిచేసుకోవాలని చాలా ప్రపంచ దేశాల నేతలు ఉవ్విళ్లూరుతుంటారు. ఆ ఘన కార్యంలో భాగంగానే తమ దేశాలకు పర్యటన పేరిట విచ్చేసిన అగ్రరాజ్య ముఖ్యనేతలకు జ్ఞాపికలతో సత్కరిస్తాయి. ప్రత్యేక ‘కానుక’లతో మెప్పిస్తారు. అదే తరహాలో అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్నకాలంలో మైక్‌ పాంపియోకు ఒక ఖరీదైన విస్కీ బాటిల్‌ను జపాన్‌ ప్రభుత్వం 2019 జూన్‌ 24న బహూకరించినట్లు అమెరికా ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఆ విస్కీ బాటిల్‌  ఖరీదు దాదాపు రూ.4,32,085. ఖరీదైన బహుమానాలను ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తులు తమ సొంతానికి తమ వద్ద అట్టిపెట్టుకోవడానికి వీల్లేదు. అమెరికా చట్టాల ప్రకారం దాదాపు రూ.29వేలలోపు విలువైన వస్తువులనే అధికారులు/మంత్రులు తమ వద్ద ఉంచుకోవచ్చు. అంతకుమించి విలువైనవి అమెరికా ప్రభుత్వానికి చెందుతాయి.

కనీసం ముట్టుకోలేదు
 ‘కనీసం నేను ఆ బాటిల్‌ను తాకనైనా తాకలేదు. ఎందుకంటే.. ఆ బాటిల్‌ సంగతే నాకు తెలియదు. నాకు ఎవరూ బహూకరించలేదు. అయినా, అంతటి ఖరీదైన బాటిల్‌ను స్వాధీనం చేసుకోవడంలో విదేశాంగ విభాగ సిబ్బంది ఎలా మిస్‌ చేస్తారు?’అని పాంపియో వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఆ తేదీన ఆయన జపాన్‌లో లేరని, సౌదీ అరేబియాకు వెళ్తున్నారని న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక కథనంలో పేర్కొంది.  బాటిల్‌ను ఎవరు మాయం చేశారనే దానిపై  లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు