ఏకైక శ్వేత జిరాఫీకి జీపీఎస్‌ ట్రాకర్‌

18 Nov, 2020 19:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో శ్వేత వర్ణ జిరాఫీలు చాలా చాలా అరదు. అలా అరుదైన జాతికి చెందిన ఓ జింకను రక్షించడం కోసం  ప్రపంచంలో తొలిసారిగా ఓ శ్వేత జిరాఫీకి జీపీఎస్‌ ట్రాకింగ్‌ పరికరాన్ని అమర్చారు. కెన్యాలోని గరిస్సా అటవి ప్రాంతంలో గత మార్చి నెల వరకు ఓ మగ, ఆడ, వాటికి ఓ పిల్ల జిరాఫీ ఉండేదట. వేటగాళ్లు ఆడ, పిల్ల జింకను చంపేయడంతో ఇప్పుడు ఆ ఒక్క మగ జిరాఫీ మాత్రమే బ్రతికి ఉందట. అలాంటి జిరాఫీ అది ఒక్కటే ఉన్నప్పటికీ  దానికి ఇంతవరకు ఏ పేరు పెట్టలేదని, అయితే దాని రక్షణార్థం అది ఎప్పుడు, ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి వీలుగా దాని కొమ్ముల్లో ఒకదానికి జీపీఎస్‌ ట్రాకింగ్‌ పరికరాన్ని అమర్చినట్లు ‘ఇషాక్బినీ హిరోలా కమ్యూనిటీ కన్సర్వెన్సీ’ ఓ ప్రకటనలో తెలియజేసింది. 

ఆ అరుదైన జిరాఫీకి ప్రత్యేక జన్యు లక్షణం వల్ల తెల్ల రంగు వచ్చిందని, జన్యు లక్షణాన్ని ‘లూసిజమ్‌’ అని వ్యవహరిస్తారని కన్సర్వెన్సీ వర్గాలు తెలిపాయి. సోమాలియా సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న ఈ జిరాఫీని దాని అరుదైన చర్మం కోసం మట్టుపెట్టడానికి వేటగాళ్లు పొంచి ఉన్నందున దానికి జీపీఎస్‌ ట్రాకర్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఆ జిరాఫీకి ఏ ఆపద రాకుండా ‘కేన్యా వైల్డ్‌ లైఫ్‌ సర్వీస్, నార్తర్న్‌ రేంజ్‌ ల్యాండ్స్‌ ట్రస్ట్, సేవ్‌ జిరాఫీస్‌’ సంస్థలు పర్యవేక్షిస్తున్నాయి.

మరిన్ని వార్తలు