న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ‘కోవ్యాక్స్’ తయారీలో భారత చిత్తశుద్ధిని కొనియాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గ్యాబ్రియేసస్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రధాని చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. కరోనా.. ప్రపంచం ఎదుర్కొంటున్న గొప్ప సమస్య, ఈ సమస్య పరిష్కారానికి కావాల్సిన వ్యాక్సిన్ తయారిలో భారత్కు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. నరేంద్ర మోదీ, గ్యాబ్రియేసస్ సంప్రదాయ ఔషదల విషయమై బుధవారం ఫోన్లో సంభాషించారు. ప్రపంచానికి సంప్రదాయ ఔషదాల అవసరం ఎంతో ఉందని, వాటిపై మరింత పరిజ్ఞానం, పరిశోధనలు అవసరమని అందుకోసం పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. (కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత)
కరోనా సమయంలో డబ్ల్యూహెచ్ఓ పాత్ర ముఖ్యమైనది
కరోనా సమయంలో ప్రపంచం మొత్తాన్ని ఒక్కటి చేసి, మహమ్మారిని ఎదుర్కొనేందుకు డబ్ల్యూహెచ్ఓ చేసిన చర్యలను మోదీ కొనియాడారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆరోగ్య ప్రమాణాల విషయంలో డబ్ల్యూహెచ్ఓ సహకారం ముఖ్యమైనదని చెప్పారు. రోగ నిరోధక శక్తి మెరుగుదలలో సంప్రదాయ ఔషదాలలో ఉన్న విలువల గురించి మాట్లాడారు. ప్రస్తుతం వైద్య విధానంలో సంప్రదాయ ఔషదాలను వినియోగించాల్సిన అవసరం ఉందని అందుకు సంబంధించిన నియమాలను, శాస్త్రవేత్తల నుంచి అనుమతి లభించగానే అందుకు ముందడుగు పడుతుందని మోదీ అన్నారు. దేశంలో నవంబర్ 13న ఆయుర్వేద దినోత్సావాన్ని జరపుతున్నామని ఈ సందర్భంగా ‘కరోనాకు ఆయుర్వేదం’ అనే అంశాన్ని ముందుకు తెస్తున్నట్లు మోదీ వెల్లడించారు.