పేద దేశాలకూ టీకా అందాలి

20 Aug, 2020 03:42 IST|Sakshi

అంతర్జాతీయ స్థాయిలో పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి

సంపన్న దేశాలను కోరిన డబ్ల్యూహెచ్‌ఓ

జెనీవా: ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ వస్తే నిరుపేద దేశాలకు కూడా అందేలా ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) పిలుపునిచ్చింది. వ్యాక్సిన్‌ అంశంలో జాతీయవాదాన్ని ప్రదర్శించకూడదని సంపన్న దేశాలకు హితవు పలికింది. వివిధ దేశాల్లో జరుగుతున్న వ్యాక్సిన్‌ పరిశోధనలు ముందడుగు వేస్తున్న తరుణంలో డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. టీకా ప్రయోగాలు విజయవంతమైతే ప్రపంచదేశాలందరి ప్రయోజనాలు పరిరక్షించేలా సంపన్న దేశాలు ముందుకు రావాలని అన్నారు. ఈ మేరకు అంతర్జాతీయంగా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని టెడ్రోస్‌ సూచించారు.  ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ముందుగా టీకా అందించాలన్నారు.

డిసెంబర్‌ నాటికి చైనా వ్యాక్సిన్‌
వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ ప్రొడక్ట్స్‌ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివరికల్లా వచ్చే అవకాశాలున్నాయి. అత్యంత కీలకమైన మూడో దశ ప్రయోగాలు ప్రస్తుతం జరుగుతున్నాయని ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధికి సహకరిస్తున్న చైనా ప్రభుత్వ కంపెనీ సినోఫార్మ్‌ చైర్మన్‌ లియూ జింగ్‌హెన్‌ తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ ఖరీదు ఇండియన్‌ కరెన్సీలో 10 వేల రూపాయల వరకు ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకుంటే వందశాతం సత్ఫలితాలు ఉంటాయని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు