‘ఈ వేరియంట్‌ వల్లే భారత్‌లో కరోనా కల్లోలం’

9 May, 2021 17:11 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి గత సంవత్సర కాలంగా ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ క్రమంలో వైరస్‌కు సంబంధించి పలు రకాల వేరియంట్ల కారణంగానే అవి వేగంగా వ్యాప్తి చెందుతూ దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భారత్‌లోనూ ప్రస్తుతం అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఓ ప్రమాదకరమైన వేరియంట్ ఉందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథ‌న్‌ తెలిపారు. ఈ కారణంగానే  దేశంలో క‌రోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ రూపాన ఇంతలా విజృంభనకు కారణమని ఆమె చెప్తున్నారు.

ప్రమాదకరమైన వేరియంట్‌ ఇది
ఈ వేరియంట్ వ్యాక్సిన్ల‌నూ బోల్తా కొట్టించ‌వ‌చ్చ‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. ఏఎఫ్‌పీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. క‌రోనాకు చెందిన‌ B.1.617 వేరియంటే ఈ విప‌త్తుకు కార‌ణ‌మ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. దీనిని తొలిసారి ఇండియాలోనే గ‌తేడాది అక్టోబ‌ర్‌లో గుర్తించారు. దీనిని ఒక ప్ర‌త్యేక‌మైన వేరియంట్‌గా డ‌బ్ల్యూహెచ్‌వో కూడా ఈ మ‌ధ్య లిస్ట్ చేసింది.

ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా వ్యాప్తికి కారణమైన  ఎన్నో వేరియంట్లను గుర్తించామని, ఇదీ కూడా అందులో ఒక‌ట‌ని సౌమ్య చెప్పారు. స‌హ‌జంగా లేదా వ్యాక్సిన్ల ద్వారా వ‌చ్చిన‌ యాంటీబాడీల‌ను కూడా బోల్తా కొట్టించే కొన్ని మ్యుటేష‌న్లు ఈ B 1.617 వేరియంట్‌లో ఉన్నాయ‌ని సౌమ్య స్వామినాథ‌న్ చెప్పారు. అందుకే ఈ వేరియంట్‌ వ్యాప్తి విషయంలో ఆందోళ‌న పడాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఈ వేరియంట్‌దే మొత్తం బాధ్య‌త అని చెప్ప‌లేమ‌ని, క‌రోనా తగ్గుముఖం పట్టినా ప్రజలు బాధ్య‌తార‌హితంగా బయట తిరగడం, సామాజిక దూరాన్ని పాటించకపోవడం, కట్టడికి నివారణ చర్యలను పాటించకపోవడం  ఉధృతికి కారణంగా ఆమె తెలిపారు.
( చదవండి: దేశంలో పంజా విసురుతున్న మ్యూకోర్‌మైకోసిస్‌ )

మరిన్ని వార్తలు