WHO: కరోనా మహమ్మారి మూలాల గురించి మీకు తెలిసిందే చెప్పండి!

4 Mar, 2023 13:23 IST|Sakshi

చైనా ల్యాబ్‌ లీక్‌ కారణంగా కరోనా వచ్చిదంటూ యూఎస్‌ వాదిస్తుండగా.. అవాస్తవం అని చైనా పదే పదే తిరస్కరిస్తు‍న్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్‌-19 మూలాలు గురించి మీకు తెలిసిందే చెప్పండని శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అన్ని దేశాలను కోరింది. 2019లో చైనాలో వచ్చిన ఈ కరోనా ప్రపంచ దేశాలను ఓ కుదుపు కుదిపేసింది. లక్షల్లో మరణాలు సంభవించగా, దేశాలన్ని ఆర్థిక సంక్షోభంలో కొట్టుకునే పరిస్థితకి దారితీసింది కూడా.

ఈ కారణాల రీత్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మహమ్మారి పుట్టుక గురించి బహిర్గతం చేయాల్సిందిగా ఆదేశించింది. అంతేగాదు దీని గురించి అంతర్జాతీయ దేశాలతో పంచుకోవడం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. ఇప్పడు నిందలు వేసుకోవడం ముఖ్యం కాదని, ఈ మహమ్మారి ఎల ప్రారంభమైంది అనేదానిపై అవగాహన పెంచుకుని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి అంటువ్యాధులను నిరోధించవచ్చని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసస్‌ అన్నారు. ఈ కోవిడ్‌-19 మూలాన్ని గుర్తించడానికి సంబంధించిన ఏ చిన్న ప్రణాళికను డబ్ల్యూహెచ్‌ఓ వదిలిపెట్టలేదని నొక్కి చెప్పారు. 

ఈ విషయంలో వాస్తవాలు కావాలి
2021లో యూఎన్‌ ఈ మహమ్మారి మూలం తెలుసుకోవడానికి సైంటిఫిక్‌ అడ్వైజరీ గ్రూప్‌(ఎస్‌ఏజీఓ) గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన డేటాను చైనా పంచుకోవాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించమని ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. అలాగే డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ ఈ విషయమై చైనా అగ్రనాయకులతో పలుమార్లు చర్చించినట్లు కూడా తెలిపారు.

ఇలాంటి విషయాలను రాజకీయాలు చేయొద్దని అది పరిశోధనలను కష్టతరం చేస్తుంది, ఫలితంగా ప్రపంచ సురక్షితంగా ఉండదని చెప్పారు. ఇటీవలే యూఎస్‌లోని ప్రముఖ ఎనర్జీ డిపార్ట్‌మెట్‌ కరోనా మూలానికి వ్యూహాన్‌ ల్యాబ్‌ లీకే ఎక్కువగా కారణమని నివేదిక కూడా ఇచ్చింది. అదీగాక ఈ ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌లోనే అత్యున్నత అధికారులు ఉండటంతో ఈ నివేదిక ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈమేరకు డబ్ల్యూహెచ్‌ఓలోని అంటువ్యాధుల ఎపిడెమియాలజిస్ట్‌ వాన్‌ కెర్ఖోవ్ మాట్లాడుతూ..ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు, దీర్ఘకాల కోవిడ్‌తో జీవిస్తున్న వారి కోసం ఇదేలా ప్రారంభమైందనేది తెలుసుకోవడం నైతికంగా అత్యంత ముఖ్యం. శాస్త్రీయ అధ్యయనంలో ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడటానికి ఈ సమాచారం పంచుకోవడం అత్యంత కీలకం అని అన్నారు. 

మరిన్ని వార్తలు