చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తారో చూద్దామని ‘చనిపోయింది’!

14 May, 2021 15:57 IST|Sakshi

సాధారణంగా కోరికలనేవి ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అందులో కొన్ని వింతవి కూడా ఉంటాయి. ఇలాంటి వింత కోరికే ఓ మహిళకు కలిగింది. మనిషి బతికిఉన్నప్పుడు ఒకలా మరణించన తరువాత మరోలా  సన్నిహితులు, ఇతరులు ప్రవర్తిస్తారని అంటారు కదా. అందుకే ఓ మహిళ తాను చ‌నిపోతే ఎవ‌రెవ‌రు వ‌స్తారు, వారు ఏం చేస్తారో చూడాల‌నుకున్న‌దంట‌.. అందుకు తానే మరణించినట్లు అందరినీ నమ్మించడానికి పడరాని పాట్లు పడిందో మహిళ. విన‌డానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇలాంటి వారు కూడా ఉన్నారంటే నమ్మడం కొంచెం కష్టమైనా నమ్మాలి మరీ.

వివరాల్లోకి వెళితే..  చిలీ రాజ‌ధాని శాంటియాగోకు చెందిన మైరా అలోంజో అనే మ‌హిళ  తాను చ‌నిపోతే తరువాత తన చుట్టు జరిగే పరిణామాలను చూడాలనుకుందంట. అదేంటి చనిపోతే ఎలా చూస్తాం అనే సందేహం వస్తుంది కదా. అదే సందేహం ఆమెకు వచ్చింది. దీంతో ఎలాగైనా తన కోరికను నేరవేర్చుకోవాలనుకుంది. అందుక‌ని ఆమెది డెత్ రిహార్సల్ చేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది. అదే త‌డ‌వుగా అద్దెకు ల‌భించే లగ్జ‌రీ శవపేటికను తెప్పించింది. ఫొటోగ్రాఫర్లను కూడా పిలిపించుకుంది. అంతా సిద్ధం చేసుకుని తెల్ల‌టి దుస్తులతో మైరా.. త‌ల‌పై పువ్వుల కిరీటం, ముక్కులో దూదిని పెట్టుకుని.. సంతాప స‌భ జ‌రుగుతున్న‌ట్లుగా ఏర్పాట్లు కూడా చేయించింది. అలా ఆమె దాదాపు మూడు గంటలపాటు శవపేటికలో పడుకుని చనిపోయిన‌ట్లు న‌టిస్తూనే ఉందంట‌. మహాతల్లి ఇదే నటన సనిమాల్లో ఇలా నటిస్తే ఆస్కార్‌  అయిన దక్కేదేమో అని అంటున్నారు చూసిన వాళ్లంతా.
ఇందులో ఇంకో వింత ఏంటంటే.. ఈ డ్రామాలో ఆమె కుటుంబం, స్నేహితులు కూడా పూర్తి మద్దతుగా నిలిచి సహకరించడం. అంత్యక్రియల నాటకం మొద‌లుకాగానే కుటుంబ సభ్యులు నకిలీ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికంత‌టికి ఆ మహిళ దాదాపు 710 యూరోలు ఖర్చు చేసిన‌ట్లు తెలిసింది. ఇలా ఉండ‌గా, మైరా తీరును కొంద‌రు ప్ర‌శంసిస్తుండ‌గా.. మరికొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. ఇటీవల ఎక్కడ చూసిన క‌రోనాతో చ‌నిపోయిన‌వారే ఎక్కువగా ఉన్నారు, ఇలా ప్రవర్తించి వారిని ఎగ‌తాళి చేయ‌డంలా ఉందని అది సరికాదని మైరా స్థానికులు అంటున్నారు.

( చదవండి: మరణం అంచున కన్నీటి వర్షంలో తల్లి‌.. చిన్నారికి చెప్పేదెలా! )

మరిన్ని వార్తలు