విమానంలో మహిళకు కరోనా పాజిటివ్‌.. 5 గంటలు బాత్రూమ్‌లోనే

31 Dec, 2021 13:52 IST|Sakshi

న్యూయార్క్‌ : కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న మహమ్మారి పేరు మార్చుకొని ఒమిక్రాన్‌ రూపంలో మరోసారి తన పంజా విసురుతోంది. యూరప్‌ దేశాల్లో కోవిడ్‌ ప్రభావం మరింత ఆందోళనకరంగా ఉంది. రోజూ లక్షల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కవ ఒమిక్రాన్‌  ఎక్కువ సోకుతుండటంతో విమాన ప్రయాణాలపై అన్ని దేశాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారికి, విదేశాలకు వెళ్లే వారికి ఎయిర్‌పోర్టు సిబ్బంది​ తప్పకుండా కోవిడ్‌ టెస్టులు చేస్తున్నారు.

అయితే, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న మహమ్మారిని అదుపు చేయడం సాధ్యపడడం లేదు. తాజాగా అమెరికాలో జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శంగా నిలిచింది. విమానం ఎక్కేముందే కోవిడ్ టెస్టు చేయించుకున్న ఓ మహిళకు ఫ్లైట్‌లో ఉండగానే పాజిటివ్‌గా తేలింది. దీంతో సదరు మహిళ నుంచి ఇతర ప్రయాణికులకు వైరస్ సోకకుండా ఉండేందుకు మహిళను 5 గంటల పాటు విమానం బాత్‌రూమ్‌లోనే ఐసోలేట్ చేశారు. 
చదవండి: టాప్‌ ఎంఎన్‌సీల్లో సీఈవోలు.. కానీ జీతం ఒక డాలరే.. ఎందుకో తెలుసా?

డిసెంబర్ 19న చికాగో నుంచి ఐస్​లాండ్‌కు 150మంది ప్రయాణికులతో ఓ విమానం బయల్దేరింది. విమానం బయలు దేరిన కొంత సమయానికి మిచిగాన్‌కు చెందిన మారీసా ఫోటీయో అనే మహిళ​ టీచర్‌కు అసౌకర్యంగా అనిపించింది. పాటు గొంతులో నొప్పి మొదలవ్వడంతో విమాన సిబ్బంది ప్రయాణంలోనే ఆమెకు కోవిడ్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఆ ర్యాపిడ్​ టెస్టులో ఆమెకు పాజిటివ్​ అని తేలింది. జర్నీ మొదలైన గంటలోపే మారిసాకు పాజిటివ్​ అని తేలడంతో తన సీటును వదిలేసి విమానం బాత్​రూంకు వెళ్లిపోయింది.
చదవండి: ఒమిక్రాన్‌తో డెల్టాకు చెక్‌!? పరిశోధనలో కీలక విషయాలు వెల్లడి

అయిదు గంటల పాటు మారిసా బాత్​రూంలోనే స్వీయ నిర్బంధంలో ఉండిపోయింది. ఆ నాలుగు గంటలు నరకయాతన అనుభవించానని మారిసా తనకు ఎదురైన దారుణ పరిస్థితిని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా మారీసా రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకుంది. అంతేగాక విమానం ఎక్కేముందు అయిదుసార్లు కోవిడ్‌ టెస్ట్‌ చేయగా నెగెటీవ్‌ రావడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు