‘వరల్డ్‌ డర్టీ మ్యాన్‌’.. 67 ఏళ్ల తర్వాత స్నానం.. నెలల వ్యవధిలోనే మృతి

25 Oct, 2022 15:40 IST|Sakshi

తెహ్రాన్‌: ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి(డర్టీ మ్యాన్‌)గా పేరు గాంచిన ఇరాన్‌కు చెందిన అమౌ హాజీ(94) కన్నుమూశారు. సుమారు 67 ఏళ్లకుపైగా స్నానం చేసి ఎరుగుని హాజీ.. కొద్ది నెలల క్రితం తొలిసారి స్నానం చేశారు. స్నానం చేసిన నెలల వ్యవధిలోనే ఆయన కన్నుమూయటం గమనార్హం. ప్రస్తుతం 94 ఏళ్ల వయసున్న అమౌ హాజీ.. మృతి చెందినట్లు ఇరాన్‌ అధికారిక మీడియా ఐఆర్‌ఎన్‌ఏ వెల్లడించింది. 

దక్షిణ రాష్ట్రం ఫార్స్‌లోని డెజ్గా గ్రామంలో ఒంటరిగా నివాసం ఉంటున్న హాజీ ఆదివారం తుది శ్వాస విడిచారని ఐఆర్‌ఎన్‌ఏ పేర్కొంది. అనారోగ్యానికి గురవుతాననే భయంతో ఆరు దశాబ్దాలకుపైగా స్నానం చేయలేదని, అయితే, కొద్ది నెలల క్రితం గ్రామస్తులు బలవంతంగా బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి స్నానం చేయించారని తెలిపింది. ఆయన జీవితంపై ‘ద స్ట్రేంజ్‌ లైఫ్‌ ఆఫ్‌ అమౌ హాజీ’ అనే డాక్యూమెంటరీ సైతం నిర్మించారు.

ఇదీ ఆయన కథ..
స్వచ్ఛమైన అనే పదానికి అమౌ హాజీ అరవై అడుగుల దూరంలో ఉండేవారు. శుభ్రమైన అనే పదం తనకు ఇష్టం ఉండదని పలు సందర్భాల్లో చెప్పారు. తనకు 20 ఏళ్లు ఉన్నప్పుడు ఏదో అనారోగ్యం వెంటాడిందని, అందుకు కారణం పరిశుభ్రతే అని గ్రహించానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అగ్ని జ్వాలలతోనే హెయిర్‌ కట్‌ చేసుకునే పద్ధతినే ఆరు దశాబ్దాలుగా ఉపయోగించేవారు హాజీ. రోజుకు 5 లీటర్ల నీటిని తాగుతారు. మురికిగా ఉన్న డబ్బాలోనే ఆ నీటిని నిల్వ ఉంచేవారు. అయితే, అపరిశుభ్రంగా జీవిస్తున్నా.. ఎంతో ఆరోగ్యంగా జీవించటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేది. ఆయనకంటూ స్నేహితులు లేరు. వివాహం చేసుకోలేదు. స్మోకింగ్‌  చేస్తూ రిలాక్స్‌ అయ్యేవారు హాజీ. 

అత్యధిక కాలం స్నానం చేయని వారిలో హాజీదే రికార్డు. గతంలో 66 ఏళ్ల కైలాశ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును అమౌ హాజీ రెండున్నర దశాబ్దాల కిందటే సవరించాడు. 38 ఏళ్లు స్నానం చేయకుండా ఉన్న కైలాశ్.. హాజీ (67 ఏళ్లు) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.

ఇదీ చదవండి: విమానంలో అద్భుతమైన ఘట్టం...30 ఏళ్ల తర్వాత....

మరిన్ని వార్తలు