షాకింగ్‌: కరోనాలో 4 వేల రకాలు 

5 Feb, 2021 12:12 IST|Sakshi

వ్యాక్సిన్ల సామర్థ్యం పెరగాలన్న బ్రిటన్‌  

ఈ నెల 13వ తేదీ నుంచి కోవిడ్‌–19 రెండో డోస్‌

లండన్‌: కరోనా వైరస్‌లో 4వేల రకాలు ఉన్నాయని, ఇవన్నీ కోవిడ్‌ కేసుల్ని పెంచేస్తున్నాయని బ్రిటన్‌ మంత్రి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా తమ వ్యాక్సిన్‌ల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని బ్రిటన్‌లో కరోనా వ్యాక్సిన్‌ కార్యక్రమ పర్యవేక్షణ చేస్తున్న మంత్రి నదీమ్‌ జహావీ అన్నారు. జన్యుక్రమ నమోదు పరిశ్రమల్లో 50శాతం పైగా బ్రిటన్‌లో ఉన్నాయని, ఈ వైరస్‌లో రకాలన్నీ లైబ్రరీల్లో భద్రపరిస్తే అవసరమైనప్పుడు అది విసిరే సవాళ్లను ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌ను తయారు చేయవచ్చునని మంత్రి  నదీమ్‌ జహావీ సూచించారు.  

ప్రయోగాత్మకంగా  మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ వ్యాక్సిన్‌ 
ఒక వ్యక్తికి కరోనా 2 డోసుల్ని రెండు వేర్వేరు కంపెనీలవి ఇచ్చి ఎలా పని చేస్తున్నాయో బ్రిటన్‌ ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి మానవ ప్రయోగాలు ప్రారంభించినట్టుగా నదీమ్‌ చెప్పారు. ఇలా మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ తరహాలో వ్యాక్సిన్‌లు ఇవ్వడం ప్రపంచంలో ఇదేతొలిసారి. ఇలా రెండు వేర్వేరు రకాల కోవిడ్‌-19 వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

13 నుంచి రెండో డోస్‌ 
దేశవ్యాప్తంగా ఈ నెల 13వ తేదీ నుంచి కోవిడ్‌-19 రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ మొదలవుతుందని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ తెలిపారు. ఇప్పటికే మొదటి డోస్‌ అందుకున్న ఆరోగ్య కార్యకర్తలు 49,93,427 మందికి ఈ డోస్‌ అందుతుందన్నారు. ఈ డోస్‌ అందుకున్న కేవలం 0.18శాతం మందిలో దు్రష్పభావాలు కనిపించాయని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం దేశంలో జనవరి 16వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం, సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా కోవిషీల్డ్, భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌ ఆరోగ్య కార్యకర్తలకు వేస్తున్నారు. కాగా, దేశంలో కరోనా కేసులు 12,899 కొత్తగా నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,90183కు చేరుకుంది. 24 గంటల్లో 107 మంది కరోనా బారినపడి మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,54,703కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది.
 

మరిన్ని వార్తలు